విశాఖకు టెస్టు హోదా: టీమిండియా సెలెక్టర్గా ఎమ్మెస్కే ప్రసాద్
ముంబై: శశాంక్ మనోహార్ అధ్యక్షతన జరిగిన 86వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) బీసీసీఐ భారీ ప్రక్షాళన చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో తెలుగువారు సంతోషించదగ్గ నిర్ణయం ఒకటి ఉంది. తెలుగువాడైన మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ భారత జట్టు జాతీయ సెలెక్టర్గా ఎంపికయ్యాడు.
భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్లకు ఉద్వాసన పలికుతూ వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు. వీరిద్దరినీ సదరు పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాల వెనుక గల కారణాలు తెలియరాలేదు. సెలక్షన్ కమిటీ సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్కు చోటు లభించింది.
గుంటూరులో జన్మించిన ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఎమ్మెస్కే ప్రసాద్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆపరేషన్స్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. భారత్ తరుపున 6 టెస్టులు, 17 వన్డేలు ఆడాడు.
1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున వికెట్ కీపర్గా ఎమ్మెస్కే ప్రసాద్ ఆడాడు. ఇక టీమిండియా డైరెక్టర్గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. గవర్నింగ్ సభ్యుల సంఖ్యను కూడా ఐదుకు కుదించారు.
ఐపీఎల్ ఛైర్మన్గా రాజీవ్ శుక్లానే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్గా అనిల్ కుంబ్లీ స్థానంలో సౌరభ్ గంగూలీని నియమించారు. విశాఖపట్నంలోని మధురవాడ స్టేడియంతో పాటు రాంచీ, ఇండోర్, పుణే, రాజ్ కోట్ స్టేడియాలకు బీసీసీఐ టెస్టు హోదా ప్రకటించింది.