ఎమ్మెల్యేల చేరిక, టిడిపిలో కొత్తXపాత: వైసిపి నుంచి వచ్చి దాడి!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన వారితో.. పార్టీలోని పాతవారికి పడటం లేదు! వైసిపి నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇప్పటి దాకా సైకిల్ ఎక్కారు. చాలా నియోజవకర్గాల్లో పాతవారికి, కొత్తగా చేరిన వారికి మధ్య విభేదాలు వస్తున్నాయి.
గిద్దలురు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి ఇంచార్జ్ అన్నా రాంబాబు, ఆయన వర్గీయులు ఒంగోలులో నిరసన వ్యక్తం చేసే స్థాయికి విభేదాలు వచ్చాయని అంటున్నారు. వైసిపి నుంచి ఇటీవలే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సైకిల్ ఎక్కారు.
పార్టీ ఇంఛార్జులకు, పార్టీలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలకు మధ్య పొంతన కుదర్చలేక చంద్రబాబు తలపట్టుకునే పరిస్థితి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వర్గం ఏకంగా దాడులకు పాల్పడుతున్నట్లు ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయని అంటున్నారు.
కంచిపల్లెలో మంగళవారం జరిగిన ఓ ఘటనలో టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు గాయపడ్డారు. అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంచాయతీ గొడవ విషయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.
ఇది కిందిస్థాయి నేతల గొడవ అయినప్పటికీ.. కడప, కర్నూలు, కృష్ణా జిల్లాలలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలతో ఇటీవల చంద్రబాబు తలపట్టుకునే పరిస్థితి కనిపించిన విషయం తెలిసిందే. పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా, నేతల మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు.