వైసీపిలో విచిత్ర పరిస్థితి.. సర్వే నివేదికతో తలపట్టుకుంటున్న నాయకులు..
ఆంద్ర ప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. పార్టీ అదినేత జగన్ మోహన్ రెడ్డిది రాజకీయంగా ఒక వ్యూహం అమలు చేస్తుంటే పార్టీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ మరో వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీలో ప్రశాంత్ కిషోర్ జరిపించిన అంతర్గత సర్వేలో చాలామంది సిట్టింగ్ లకు సీటు దక్కే అవకాశం లేదనే అంశం నిర్ధారణ కావడంతో నేతలు ఒక్కసారిగా అయోమయానికి గురౌతున్నారు. పార్టీలో ప్రశాంత్ కిషోర్ జోక్యం శ్రుతి మించిపోతుందంటూ కొంత మంది నేతలు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు తాజాగా జరిపిన సర్వే కూడా పార్టీలో పెద్ద దుమారం లేపుతోంది.
ఒక పార్టీ బలోపేతం.. మరో పక్క అంతర్గత సర్వే.. అయోమయంలో నేతలు..
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీడు పెంచాడు. ఒకవైపు ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల నాటికి దృఢంగా తయారయ్యేలా ప్లాన్లు చేస్తున్నాడు. ఇందుకుగానూ కొంత మంది నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. వారు వారి పనుల్లో బిజీగా ఉండగానే జగన్ ప్రజాసంకల్పయాత్రతో ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ మధ్య ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనుకూలంగా మారకపోగా, ప్రతికూలంగా మారుతున్నాయనే చర్చ జరుగుతోంది.
అన్నీ తప్పిదాలే..! చేతులు కాలాక ఏదో పట్టుకున్నట్టు తయారయ్యింది వైసీపి వైఖరి..!
ఎంపీలతో రాజీనామా చేయించడం ద్వారా టీడీపీకి చేజేతులా ఛాన్స్ ఇచ్చుకున్నాడు జగన్. అంతటితో ఆగకుండా పవన్పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాపు రిజర్వేషన్లపై రెండు రకాల ప్రకటనలు చేయడంతో వైసీపీ అధినేత చిక్కుల్లో పడిపోయాడు. ఈ క్రమంలోనే కొందరు పార్టీ మారడం వైసీపీని మరింత దెబ్బతీసింది. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం చేసిన సర్వే ఫలితాలు వచ్చాయట. వాటిని పాదయాత్రలో ఉన్న జగన్కు అందించాడట పీకే. ఇప్పుడు వైసీపీ నాయకులను సర్వే భయం వెంటాడుతోందని తెలుస్తోంది.
గెలుపు గుర్రాల అన్వేషణ..! సిట్టింగ్ లకు ఇబ్బందుల తప్పేలా లేదు..!
వచ్చే ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావించిన వైసీపీ.. గెలుపు గుర్రాలను అన్వేషించడానికి సర్వే చేయించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే వ్యూహకర్త పీకేకు ఆ బాధ్యతలను అప్పగించాడు జగన్. నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు? ఏ నాయకుడికి ఏ సామాజిక వర్గం బలంగా ఉంటుంది? తదితర వివరాలతో కొద్దినెలలుగా పీకే బృందం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిందని సమాచారం.
వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండవ పవర్ స్టేషన్ పై నేతల గుస్సా..!
అంతేకాదు పీకే బృందం సభ్యులు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులకు తెలీకుండానే ప్రజలతో మమేకమై అభిప్రాయాలు సేకరించారని తెలిసింది. ఈ నివేదిక ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలనుకున్న జగన్, ఇటీవల పీకే ఇచ్చిన నివేదిక చూసిన తర్వాత కొందరు నాయకులకు పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్రకు బ్రేకిచ్చి, నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత సన్నాహాలు చేసినట్లు సమాచారం. అయితే, వివిధ కారణాలతో ఆ సమావేశం తాత్కాలికంగా వాయిదా పడిందని, కానీ త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా ముఖ్య నాయకులతో భేటీ ఉంటుందని ప్రచారం జోరుగా జరుగుతోంది.