మా లేఖతోనే టి వచ్చింది, బాబు పర్యటిస్తారు: ఎర్రబెల్లి
టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ లేఖ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. త్వరలో చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. తమ పార్టీ సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేస్తామన్న బాబు తెలంగాణపై తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చి, ఇరు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాబుతో పాటు తాము ఢిల్లీకి వెళ్తామన్నారు.
జానాతో మందకృష్ణ భేటీ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం హైదరాబాదులో భేటీ అయ్యారు. విద్యార్థి యుద్ధ భేరీ సభకు మద్దతివ్వాలని జానాను కోరారు. అందుకు జానా సమ్మతించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయించేందుకు అవసరమైతే తాము ఢిల్లీ వెళ్తామని జానా ఈ సందర్భంగా చెప్పారు.
అనంతరం మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విభజనపై జాప్యం దానిని అడ్డుకునే శక్తులకు ఊతమిస్తుందన్నారు. సిడబ్ల్యూసి చేసిన ప్రకటనలో ఒక్క అక్షరం వెనక్కి పోయినా ఊరుకునేది లేదన్నారు. యుద్ధ భేరీని తాము ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో నిర్వహించ తలపెట్టిన సభను అక్టోబర్ 6కు వాయిదా వేసుకుంటున్నట్లు చెప్పారు.