ఢిల్లీలోనూ చంద్రబాబుకు చెక్: వైసీపీ మద్దతు కోరిన కాంగ్రెస్: జగన్ అసలు వ్యూహం ఇదేనా..!
Recommended Video
చంద్రబాబు వర్సెస్ జగన్. ఇది ఏపీ రాజకీయాల్లోనే కాదు..ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాజకీయ పోరు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో ఎవరికీ మెజార్టీ వచ్చే అవకాశం లేదనే సర్వేల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకు డిమాండ్ పెరుగింది. ఇక, మోదీకి వ్యతిరేకంగా రాహుల్తో చంద్రబాబు చేతులు కలిపారు. మోదీ ఒక ప్రధానిగా ఉండరని..23 తరువాత కొత్త ప్రధాని వస్తారని..అందులో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. అనూహ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో వైసీపీ వేడి పెరిగింది.
వైసీపీ మద్దతు కోరుతున్న కాంగ్రెస్..!
కేంద్రంలో ఎన్నికల ఫలితాల తరువాత తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్లు వైసీపీ నేతలతో టచ్లోకి వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ తో కలిసి రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. మోదీని ప్రధాని పదవి నుండి దించాలని..మహాకూటమి అభ్యర్దిని ప్రధాని చేయాలనేది ఆయన లక్ష్యం. దీని కోసం అనేక పార్టీల నేతలతో సంప్రదింపులు..సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వైసీపీ ముఖ్యనేతతో ఇదే విషయం పైన చర్చలు జరిపారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం 23న వెల్లడయ్యే ఫలితాల తరువాత దీని పైన చర్చిద్దామంటూనే అనేక విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన తరువాత పార్టీ అధినేత జగన్ దీని పైన స్పందిస్తారని చెప్పినట్లు సమాచారం.
చంద్రబాబు ఉండగానే..ఎలా సాధ్యం..
యుపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా తటస్థంగా ఉన్న పార్టీల నేతలతోనూ చంద్రబాబు కలుస్తున్నారు. ఎన్నికల తరువాత ఒక్కటిగా ఉండాలని కోరుతున్నారు. ప్రధాని అభ్యర్ది ఎవరనేది ఫలితాల తరువాత నిర్ణయించుకుందామని చెబుతున్నారు. అయితే, చంద్రబాబు కాంగ్రెస్ అధినేత వద్ద క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో ఆ పార్టీ నేతలు వైసీపీ నేతలతో టచ్లోకి రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు తమతో ఉన్నా..ఏపీలో వైసీపీ అధికంగా లోక్సభ సీట్లు సాధిస్తుందనే సర్వేల లెక్కలతో ఆ పార్టీ ముందడుగు వేసినట్లు చెబుతున్నారు. ఏపీ నుండి చంద్రబాబు తమతోనే ఉన్నా..కేసీఆర్...జగన్ ఒకవేళ మోదీకి మద్దతుగా నిలిస్తే తమకు నష్టమని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు తెలిసే కాంగ్రెస్ నేతలు వైసీపీతో మంతనాలు చేస్తున్నారా లేక ఆయనతో సంబంధం లేకుండా చర్చలు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
చంద్రబాబు ఉంటే..వైసీపీ నో...
గతంలో కేసుల పేరుతో తనను వేధించిన కాంగ్రెస్ పైన ఎటువంటి కక్ష్య లేదని జగన్ ఇప్పటికే జాతీయ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. అయితే, కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకూడదని ఆశిస్తున్నారు. కేసీఆర్తో కలిసి నడిచేందుకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే కూటమిలో చేరాలన్నా..కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడే ప్రభుత్వంలో ఉండాలన్నా..అందులో చంద్రబాబు ప్రమేయం ఉంటే వైసీపీ అందులో చేరే అవకాశం ఉండదన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీని ద్వారా తాము కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్నా అభ్యంతరం ఉండదని చెబుతూనే..ప్రత్యక హోదా ఎవరిస్తే వారికే మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ చేసిన డిమాండ్లో మరో కోణం ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి చంద్రబాబు దూరమయ్యారు. ఇక, లోక్సభ సీట్లు టీడీపీ కంటే తమకే ఎక్కువ వస్తాయనే అంచనాలో ఉన్న వైసీపీ జాతీయ రాజకీయాల్లోనూ ఆ సీట్ల సంఖ్య ద్వారా చంద్రబాబు కంటే తమకే ప్రాధాన్యత లభిస్తుందని..దీని ద్వారా అక్కడ కూడా చంద్రబాబు పైన పైచేయి సాధించాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ అంచనాలన్నింటికీ 23న ఫలితాల తరువాతే స్పష్టత రానుంది.