ఏం లేదు!: కే లక్ష్మణ్, దేన్నీ వదల్లేదు: కొండా సురేఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన విపక్షాలు బుధవారం మండిపడ్డాయి. ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోవైపు విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆ విషయాన్ని ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన వాగ్ధానాలకు, హామీలకు భిన్నంగా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు.
ఈ బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా పోసినట్లుగా ఉందన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే నివారణ చర్యలు ప్రస్తావించలేదని ఆరోపించారు. మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారన్నారు. నిర్బంధ విద్యకు కేవలం రూ.25 కోట్లు కేటాయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారన్నారు. ఈ బడ్జెట్ గందరగోళంగా, అయోమయంగా ఉందన్నారు. విద్యుత్ సంక్షోభం నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చెప్పలేదన్నారు. తాము వాకౌట్ చేశామని చెప్పారు.
నిరాశ కలిగించింది: ఎన్వీవీఎస్
బడ్జెట్ నిరాశ కలిగించిందని ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన తెరాస.. అందుకు తగ్గట్లుగా బడ్జెట్ రూపకల్పన చేయలేదని అభిప్రాయపడ్డారు. నిర్బంధ విద్యకు రూ.25 కోట్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా మొక్కుబడిగా కేటాయింపులు చేశారన్నారు.
నిరుత్సాహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అమరవీరుల కుటుంబాలు, రైతుల పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి బడ్జెట్లో ఏమీ లేదని, రైతుల కోసం ఏమి చేయబోతున్నారో కూడా చెప్పలేదని మండిపడ్డారు.
ఈ బడ్జెట్ను చూస్తుంటే, తెలంగాణలో విద్యుత్ కష్టాలు కొనసాగుతాయనే విషయం అర్థమవుతోందని చెప్పారు. గత ప్రభుత్వాలను నిందించడమే ఏకైక లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. పెన్షన్లకు కేటాయించిన నిధులను చూస్తుంటే పెన్షన్ దారుల జాబితా నుంచి చాలామందిని తొలగిస్తున్నారనే అనుమానం కలుగుతోందని, శాసనసభ కొనసాగినంత కాలం ప్రజాసమస్యలపై పోరాడుతామన్నారు.
బాగుంది: కొండా సురేఖ
బడ్జెట్ బాగుందని, ఎంతో పారదర్శకంగా ఉందని, ప్రజలు ఆమోదించేలా ఉందని తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. అన్ని జిల్లాలను పరిగణలోకి తీసుకున్నారన్నారు. అలాగే, ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన ఉద్యోగులు, విద్యార్థులు, కళాకారులు, లాయర్లను.. ఇలా అందరినీ గుర్తించారన్నారు. పోలీసులు, మహిళలను కూడా గుర్తించారన్నారు. అందర్నీ గుర్తించారన్నారు. బడ్జెట్ బాగుందని, 14 బడ్జెట్లు తాను చూశానని, ఇంత మంచి బడ్జెట్ చూల్లేదని జూపల్లి కృష్ణారావు అన్నారు.
సభ్యుల పట్ల గౌరవంగా వ్యవహరించడం లేదు: డీఎస్
సభ్యుల పట్ల అధికార పక్షం సరిగా వ్యవహరించడం లేదని డీ శ్రీనివాస్, షబ్బీర్ అలీ అన్నారు. చైర్మన్కు డిప్యూటీ సీఎం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఇది పద్ధతి కాదన్నారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశ్యం కాదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారన్నారు. బడ్జెట్లో ఫిగర్ కనిపిస్తోందని కాని, నెరవేర్చేలా కనిపించడం లేదన్నారు.