ఏపీలో కాంగ్రెస్ బస్సుయాత్ర..! ప్రత్యేక హోదా సాధనలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూసి ఏపి కాంగ్రెస్ స్పూర్తి పొందినట్టు తెలుస్తోంది. ఏపిలో స్తబ్దుగా ఉండకుండా ప్రజాకార్యక్రమాల రూపకల్పనకు నడుం బిగిస్తోంది. పోయిన చోటే వెత్తుక్కోవాలి అన్నట్టు విభజనతో గాయపడిన ఆంద్ర ప్రజల మనోభావాలను అదే విభజన హామీల అమలుతో మాన్పించాలని చూస్తోంది ఏపి కాంగ్రెస్. అందుకోసం ప్రత్యేక హోదా అంశాన్ని ఆయుధంగా ఎంచుకుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో బస్సు యాత్ర చేపట్టి కాంగ్రెస్ పట్ల ఉన్న ఆగ్రహావేశాలను చల్లార్చాలని యువజన నేతలు కసరత్తు చేస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేననే సంకేతాలు పంపాలనుకుంటున్నారు హస్తం నాయకులు. అంతే కాకుండా బస్సు యాత్రకు ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించి ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయించాలని కూడా సన్నాహాలు చేస్తున్నారు ఏపి కాంగ్రెస్ నేతలు.
ఏపీలో యూత్ కాంగ్రెస్ బస్సు యాత్ర..! ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం..!!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం యువజన కాంగ్రెస్ బస్సుయాత్ర చేపడుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. పనిలో పనిగా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో అవసరమైతే ఆమరణ దీక్షలకు దిగుతామనికూడా చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సారధ్యంలో ఈ బస్సుయాత్ర అనంతపురం నుంచి ఉత్తరాంధ్రా వరకు నిర్వహించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నాట. ఎన్నికల సమయంలో లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేకహోదా తో పాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన బీజేపీ ప్రజలను మోసం చేసిన విధానాన్ని కూడా క్షేత్ర స్ధాయిలో ఎండగట్టాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
బస్సు యాత్రకు రాహుల్ ను ఆహ్వానించనున్న నాయకులు..! జోష్ లో యువజన కాంగ్రెస్..!
ప్రతీ జిల్లాలోను రెండు రోజుల పాటు ర్యాలీలు, రోడ్షోలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ చేసిన మోసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని చెబుతున్నారు. కాగా ఈ సభలు, సమావేశాల్లో ఏఐసీసీ, ఐవైసీ, పీసీసీ నుంచి వివిధ హోదాల్లో ఉన్నవారు పాల్గొంటారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను యువజన కాంగ్రెస్ పార్టీ 21 జిల్లాలుగా మార్పుచేసుకుని ఈ పనిచేయనుందని తెలుస్తోంది. ఈ 21 జిల్లాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేసుకునే ప్రక్రియను ఈ నెల 25వ తేదీతో ముగిస్తారట.
అలుపెరగని పోరాటం..! అదే యూత్ కాంగ్రెస్ లక్ష్యం..!
అదే విధంగా రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 42 వేల బూత్ కమిటీలను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ సారధ్యంలో బస్సు యాత్రను ముగించాక యువజన కాంగ్రెస్ జలదీక్షలు, కలెక్టరేట్ల వద్ద రిలే దీక్షలు తదితర ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని తెలుస్తోంది. అలాగే ప్రజలను తిరిగి తమ వైపు మరల్చుకునేందుకు వాడవాడలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వీధికూడలి ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు, అలాగే అభిమానుల ఇళ్ల వద్ద పార్టీ గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టే పథకాలను ప్రచారం చేయడానికి సూచికగా బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
బస్సు యాత్రతో దూసుకుపోవాలని చూస్తున్న కాంగ్రెస్..
పనిలో పనిగా రాష్ట్ర విభజన పాపం తమ ఒక్కరిదే కాదని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినందునే ఇది జరిగిందని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విభజనలో జరిగిన అన్యాయాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూరించగలదని ఆ బోర్డుల్లో రాయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కరపత్రాల పంపిణీ, వీలైన చోట్ల కార్యకర్తల ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈ మేరకు వీలైనంత త్వరలో అన్ని చోట్లా పార్టీ ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో కాంగ్రెసే నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ కలసివస్తాయో చూడాలి.