ఆ ముగ్గురు.. కిరణ్కు ఢిల్లీ కౌంటర్, కెకెకు కాంగ్రెస్ అండ!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టేలా కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితితో అవగాహనకు కూడా వచ్చినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెసు పార్టీ తమ నాలుగో అభ్యర్థిని ప్రకటించలేదని, తెరాస కె కేశవ రావును బరిలోకి దించిందని అంటున్నారు. ప్రస్తుతం సభలో బలాబలాల ప్రకారం కాంగ్రెసుకు మూడు, టిడిపి రెండు దక్కుతాయి.
ఆరో స్థానం విషయంలో ఓటింగ్ జరుగుతుందా అనే ఆసక్తి మొదటి నుండి ఉంది. కాంగ్రెసు వ్యూహాత్మకంగా కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామి రెడ్డిల పేర్లు ప్రకటించిందని అంటున్నారు. మొదటి నుండి సమైక్యవాదం వినిపిస్తున్న కెవిపిని పలువురు సీమాంధ్ర సభ్యులు బలపరుస్తారు. తెలంగాణ నేతలు ఎంఏ ఖాన్ వైపు మొగ్గుతారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని మైనార్టీలను ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక విభజనపై ఆగ్రహంతో ఉన్న వారిని లేదా రెబల్స్ను ఎదుర్కొనేందుకు టిఎస్సార్ను బరిలోకి దింపారంటున్నారు.
మిగిలిన ఎమ్మెల్యేల సహకారం తెరాసకు ఉంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్ - తెరాసల మధ్య అవగాహన ఉన్నందునే కెకెను బరిలోకి దింపారంటున్నారు. కెకె గతంలో కాంగ్రెసులో పని చేసినందున ఆయనకు కాంగ్రెసు సభ్యులు మద్దతు పలికే అవకాశముంది. మద్దతుపై కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే కెకె అభ్యర్థిత్వాన్ని కెసిఆర్ ఖరారు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కెకె విజయాన్ని ఖరారు చేసేందుకు వీలుగానే కాంగ్రెస్ మూడు స్థానాలకే పరిమితమైందని చెబుతున్నారు.
సరైన బలం లేకుండా రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి దించితే అభాసుపాలు కావాల్సి వస్తుందని కెసిఆర్ మొదటి నుంచి భావిస్తున్నారు. అయితే కెకె తన గెలుపుకు కాంగ్రెసు పార్టీలో లాబీయింగ్ చేసే అవకాశం ఉన్నందున, ఆయన పైన నమ్మకంతో కెసిఆర్ ఆ పేరును ప్రకటించారని అంటున్నారు. కెకె తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.