కేసీఆర్వల్లే, శాసించే స్థాయికొచ్చాం: స్వామి నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలి చైర్మన్ అంశం కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం తెరాస ఎమ్మెల్సీ స్వామి గౌడ్ శాసనమండలి చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగం, కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. అందరు కన్న అభివృద్ధి కలలు నెరవేరాలంటే అందరు ఏకగ్రీవంగా తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అనేక హామీలు ఇచ్చిందని, వాటిని అమలుపరిచే ప్రక్రియలో భాగంగా వారు తనను మండలికి చైర్మన్గా నామినేషన్ దాఖలు చేయాలని తనను ఆదేశించారన్నారు. ప్రజాస్వామ్యం మహోన్నతమైనదని.. నాడు ఏపీ ప్రభుత్వంలో ఆశించే స్థాయి నుండి తాము శాసించే స్థాయికి వచ్చామన్నారు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని తెలంగాణ ఐక్యత చాటాలన్నారు.
స్వామిగౌడ్ నామినేషన్ కార్యక్రమంలో మహమూద్ అలీ, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్, కల్వకుంట్ల తారక రామారావు తదితరులు హాజరయ్యారు. స్వామి గౌడ్కు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. కాగా, రేపు మండలి చైర్మన్ ఎన్నిక జరగనుంది.
కాంగ్రెస్ నుండి ఫారూఖ్ హుస్సేన్
కాంగ్రెస్ పార్టీ కూడా చైర్మన్ పదవికి పోటీ పడుతోంది. ఫారూఖ్ హుస్సేన్ను చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. షబ్బీర్ అలీ, ఎంఏ ఖాన్, పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్ తదితరులు అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు విప్ జారీ చేశారు. తెరాసలో చేరిన ఎమ్మెల్సీలకు కూడా విప్ ఇచ్చారు.
40 స్థానాల్లో...
తెలంగాణ రాష్ట్రంలో 40 శాసన మండలి స్థానాలు ఉన్నాయి. అందులో ఇటీవల కాంగ్రెసు, టీడీపీల నుండి చేరిన వారితో కలిపి టీఆర్ఎస్కు 16 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెసు పార్టీకి పన్నెండు, టీడీపీకి నలుగురు ఉన్నారు. మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్కు మద్దతు పలుకుతోంది. మరోవైపు తెరాసకు మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.