టిడిపి లోకి వస్తున్నా సహకరించండి:కొండ్రు;టిడిపి ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్లరు:కొల్లు
శ్రీకాకుళం:టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ఈ మార్పు విషయమై అనుచరులను,మద్దతుదారులను మానసికంగా సిద్దం చేయడంతో పాటు టిడిపి శ్రేణులను ప్రసన్నం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు పనితీరుకు ఆకర్షితుడై తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. దీనికి టిడిపి శ్రేణులు తనకు సహకరించాలని కోరారు.
చేరికపై...స్పష్టత
సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామంలో పార్టీ సీనియర్ నేత కొల్ల అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి కేసరి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీనేత, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ పాల్గొని మాట్లాడారు. టిడిపిలో చేరే విషయమై సీఎం చంద్రబాబు, మంత్రి కళా వెంకట్రావును కలిశానని...వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
చేరుతున్నా...సహకరించండి
ముఖ్యమంత్రి నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో ఈనెల 31న అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. దీనికి టీడీపీ శ్రేణులు సహకరించాలని కోరారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తన చక్కటి పనితీరుతో అభివృద్ది పథంలో నడిపిస్తున్న సమర్ధ ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు అని కొనియాడారు. అనంతరం టిడిపి సీనియర్నేత కొల్ల అప్పలనాయుడుతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని అన్నారు. కోండ్రు టిడిపిలో చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజాం నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం...అక్కడ పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకపోవడం...కోండ్రు మంత్రిగా నియోజకవర్గంలో మంచి పట్టు సాధించడం తదితర కారణాలతో కోండ్రుకు చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆయన వెంటే...మేమూ చేరతాం
మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ వెంటే తాము ఉంటామని డీసీసీ ప్రధాన కార్యదర్శి మరిపి జగన్మోహనరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గ్రంథి గోపి తదితరులు ఈ సందర్భంగా తెలిపారు. రాజాం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన కోండ్రుకు తమ పూర్తి మద్దతు ఉంటుదన్నారు. అతని వలనే తమకు కాంగ్రెస్పార్టీలో గుర్తింపు వచ్చిందని, తాము కూడా పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరుతామని వారు తెలిపారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో కోండ్రు సుమారు రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని, మళ్లీ రాజాం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మురళీమోహన్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు...జనసేనలోకి వెళ్ళరు
మరోవైపు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వెళ్లనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కొల్లు రవీంద్ర కొట్టి పడేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే అవకాశమే లేదని ఆయన తేల్చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే ఆశతో ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు. ఇక జగన్వి లాలూచీ రాజకీయాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు నిండి జలకళ ఏర్పడటంతో ఈర్ష్యతో జగన్ కళ్ల నుంచి నీళ్లు కారుతున్నాయన్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతోనే అమరావతి బాండ్లను కొనేందుకు ప్రజలు పోటీపడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.