రేసులో బాబు-పవన్-జగన్, కాంగ్రెస్ 'పాత' ప్లాన్: ఇక కిరణ్ కుమార్, ఉండవల్లిలకు గాలం!
అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్వవైభవం కోసం ఉవ్వీళ్లూరుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రజలు కనీసం ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కాదు కదా.. ఎన్నో చోట్ల ఆ పార్టీ నేతలకు డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ పాత రోజుల కోసం ప్రయత్నిస్తోంది.
Recommended Video
నేనోడిపోతానా.. ఆ సర్వే చిచ్చు: గంటా మనస్తాపం, కేబినెట్ భేటీకి డుమ్మా, బాబు పర్యటనపై డైలమా
ఏపీలో ఇన్నాళ్ల పాటు బీజేపీ - టీడీపీ పొత్తు, ప్రత్యేక హోదా వంటి కీలక హామీతో పాటు పలు హామీలు కేంద్రం నెరవేర్చలేదని, ఇన్నాళ్లు బీజేపీతో పొత్తు కలిగి ఉన్న టీడీపీ ఏం చేయలేకపోయిందని, నిలదీయడంలో వైసీపీ విఫలమైందని చెబుతూ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
పూర్వవైభవం కోసం ఊమన్ చాందీ ప్రయత్నం
కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం రావాలంటే కేవలం హామీలతోనే సరిపోదని గుర్తించిన కొత్త పార్టీ ఇంచార్జ్ ఊమెన్ చాందీ పాత నేతల పైన దృష్టి సారించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలను తిరిగి దరి చేర్చుకోవాలని భావిస్తున్నారు. గురువారం ఆయన ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాత నేతలతో మాట్లాడాలని సూచించారు.
కిరణ్ కుమార్ రెడ్డికి గాలం
ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులతో మాట్లాడాలని సూచించారు. వారిని తిరిగి పార్టీలోకి రప్పించాలని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడే బాధ్యతను పార్టీ సీనియర్ నేత పళ్లం రాజుకు అప్పగించారు. కీలక మాజీ నేతలను పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయాలన్నారు. టీడీపీ, వైసీపీకి జనసేన తోడు కావడంతో ఏపీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కనీసం రేసులో ఉండాలంటే పాత కాపులను తీసుకు రావాల్సిందేనని భావిస్తున్నారు.
వారు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారా?
కిరణ్ రెడ్డి, ఉండవల్లి వంటి నేతలు తిరిగి పార్టీలోకి రావడం ఎంత వరకు సాధ్యమనే అంశంపై చర్చ సాగుతోంది. కిరణ్ సోదరుడు కిషోర్ రెడ్డి టీడీపీలో చేరారు. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననుకున్నప్పటికీ ఇక్కడ విషయం వేరు. పైగా ఓ పార్టీ స్థాపించి ఓడిపోయారు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో కూడా ఆయన చేరేందుకు ఆసక్తి కనబర్చలేదు. అలాంటి కిరణ్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది ప్రశ్నే. మరోవైపు ఉండవల్లి కూడా తాను రాజకీయాల్లోనే ఉన్నానని, కానీ ఏ పార్టీ వైపు వెళ్లనని తేల్చి చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది అప్పుడే చెప్పలేని పరిస్థితి.
2014లో బీజేపీ ఇచ్చిన హామీతోనే ఇప్పుడు కౌంటర్
2014కు ముందు బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది. కానీ పలు కారణాల వల్ల ప్రత్యేక హోదా బదులు అంతకుమించి ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది. అయితే వివిధ రాజకీయ కారణాలతో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా ప్రత్యేక హోదా అంటోంది. వైసీపీ, జనసేనలు మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి రాహుల్ ప్రధాని అయితే హోదా ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా గతంలో చెప్పారు. 2014లో విభజనతో దెబ్బతిన్న కాంగ్రెస్.. నాడు బీజేపీ ఇచ్చిన ఆయుధంతో 2019లో నిలదొక్కుకోవాలని చూస్తోంది.