జగన్ ఒక్కడే కాదు, ప్రతి ఒక్కరు: భేటీలో కిరణ్ కుమార్ రెడ్డి, గందరగోళంలో వైసీపీ
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోను పొత్తు ఉండదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బుధవారం తేల్చి చెప్పింది. ఆంధ్రరత్న భవన్లో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగిందని తెలుస్తోంది.
చట్టంలో ఉందిగా మోడీకి ఇబ్బందేంటి!: టీడీపీ ఎంపీలతో రాష్ట్రపతి, కేశినేనికి మమత ప్రశంస
కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చాలని ఈ భేటీలో మాజీ మంత్రి శైలజానాథ్ సూచించారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే మన ప్రధాన ప్రత్యర్థి అని జేడీ శీలం వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు.. పోటీ చేసే ప్రతి పార్టీ మనకు ప్రత్యర్థేనని, ఏ ఒక్క పార్టీ కాదని తేల్చి చెప్పారు.
వైయస్ జగన్ గందరగోళంలో ఉన్నారు
వచ్చే ఎన్నికల్లో అందరూ ఒంటరి పోరుకు సిద్ధం కావాలని ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఊమెన్ చాందీ తెలిపారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్ల అంశంపై వైసీపీ అధినేత వైయస్ జగన్ గందరగోళంలో ఉన్నారని వారు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
జాతీయ పార్టీల వల్లే మేలు అని ప్రజలకు చెప్పాలని కిరణ్
ఏపీకి ప్రత్యేక హోదాతో వచ్చే లబ్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. జాతీయ పార్టీలతోనే మేలు అనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ పర్యటనపై కూడా చర్చించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఇంటింటికి కాంగ్రెస్ చేపట్టాలని ఊమెన్ చాందీ సూచించారు.
వారిద్దరి చేరిక సంతోషం
భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఊమెన్ చాందీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి అన్ని ప్రాంతాల్లో పర్యటించామని చెప్పారు. గ్రామ, మండల స్థాయి నుంచి పోలీంగ్ బూత్ స్థాయి వరకూ కూడా పార్టీ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పార్టీలోకి రావడం సంతోషమన్నారు.
ప్రత్యేక హోదాపైనే ఎన్నికలకు
ప్రత్యేక హోదా అంశంపైనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని, ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండబోదని ఊమెన్ చాందీ తేల్చి చెప్పారు. ప్రజలతోనే తమ పొత్తు అన్నారు. మూడున్నరగంటలపాటు పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.