ఎపి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించనున్న ఊమెన్ చాందీ
విజయవాడ : కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందునిమిత్తం ఆయన సోమవారం విజయవాడ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఆఖరు వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లుగా తెలిపారు. ఈ పర్యటనలో పార్టీ పునర్నిర్మాణంపై నేతలతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే విషయాన్ని ఉమెన్ చాంది ఖాయం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ద్వారా ఆయన కాంగ్రెస్ లో ఏ మేరకు పునరుజ్జీవం నింపుతారనేది ఆసక్తికరంగా మారింది.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ బెంగుళూరులో మాట్లాడుతూ ఈనెల 13న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరనున్నారని తెలిపారు. ఎపిలో పార్టీ బలోపేతం కోసం జులై 31 వరకు 13 జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహిస్తానని, ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో పర్యటన కొనసాగుతుందని తెలిపారు.
పార్టీకి కార్యకర్తలే బలం అని ఊమెన్ చాందీ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగిన శక్తి కాంగ్రెస్ కే ఉందని తెలిపారు. మోడి పాలనలో దేశంలో లౌకిక వాదం దెబ్బతిందని...జీయస్టీ వల్ల లక్షల మంది రోడ్డున పడ్డారని ఆయన చెప్పారు. కలసి కట్టుగా ప్రజల సమస్యలపై పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తేవాలని ఊమెన్ చాందీ పిలుపునిచ్చారు.