అది కాకిగోల: అసహనపై వెంకయ్య సీరియస్, 'ఉదయ్' స్కీంలోకి ఏపీ ఫస్ట్
విజయవాడ: అసహనం పేరుతో దేశంలో కొందరు కాకి గోల చేస్తున్నారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు ఘాటుగా స్పందించారు. బిజెపి ఈ రోజు చెప్పే ప్రతి మాట, నాడు అవిభక్త కాంగ్రెస్ చెప్పిందేనని చెప్పారు.
బాలగంగాధర తిలక్, రాజ్ గురు, గోపాల కృష్ణ గోఖలే, మదన్ మోహన్ మాలవ్య చెప్పిన అభిప్రాయాలనే తాము చెబుతున్నామని వెంకయ్య అన్నారు. ఆయన విజయవాడలో 'నాడు నిశ్సబ్దం - నేడు నిరసనా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి అసహనం అనే దానిని తెరపైకి తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు. భారత్లో పామును, గుట్టను, చెట్టును పూజిస్తారన్నారు. ప్రతి దానిని గౌరవించే సంస్కృతి మనలో ఉందన్నారు.
'ఉదయ్' పథకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఉజ్వల్ డిస్కం హామీ యోజన(ఉదయ్) పథకంలో ఆంధ్రప్రదేశ్ చేరింది. దేశవ్యాప్తంగా రుణభారంతో ఉసూరంటున్న విద్యుత్ పంపిణీ సంస్థల పునరుజ్జీవనానికి కేంద్రం ఉద్దేశించిన ఈ పథకంలో చేరిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే అవుతుంది. 'ఉదయ్'లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్ సంసిద్ధతను వ్యక్తం చేసింది.
అదే విషయాన్ని విద్యుత్ మంత్రిత్వశాఖకు వెల్లడించింది. జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలు ఉదయ్లో చేరేందుకు ఆసక్తి చూపాయి.
అయితే, ఉదయ్ కింద ప్రయోజనాలను పొందేందుకు సిద్ధమేనంటూ కేంద్రానికి నేరుగా లేఖరాసిన తొలిరాష్ట్రం అంధ్రప్రదేశే అవుతుంది. దీనిపై కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పియూష్ గొయెల్ ట్విట్టర్లో స్పందించారు. 'ఉదయ్'లో చేరినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు.