'అవినీతిలో ఏపీ నెంబర్ వన్': ఏపీ ప్రభుత్వంలో కదలిక తెచ్చిన 'టీ' ఘటన
అమరావతి: అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఆయన ఎద్దేవా చేశారు.
అవినీతిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని అందుకే ఇక్కడికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఏపీకి అభివృద్ధికి ప్రత్యేకహోదా తప్ప వేరే మార్గం లేదని ఆయన చెప్పారు. శనివారం జరగనున్న అంతరాష్ట్ర మండలి సమావేశంలో చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల కోసం విడుదల చేసిన రూ.700కోట్లలో కేవలం ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతోందని చెప్పిన ఆయన సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల కారణంగా అయిన ఖర్చులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవుళ్లకు భద్రత లేకుండా పోయిందని చెప్పారు. కృష్ణా జిల్లా అటవీ భూములను డీనోటిఫై చేసి కడప జిల్లాలో అటవీ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామంటే రక్తపాతమవుతుందని ఆయన హెచ్చరించారు.
వాన్పిక్ వివాదం వల్లే గుంటూరుకు పరిశ్రమలు రావడం లేదు
వాన్పిక్ వివాదం వల్లే గుంటూరుకు పరిశ్రమలు రావడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో వివాదంగా మారిన వాన్పిక్ కారణంగానే గుంటూరు జిల్లాకు పరిశ్రమలు రావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల హైదరాబాదులో మద్యం మత్తులో మైనర్ బాలురు ర్యాష్ డ్రైవింగ్లో భాగంగా చేసిన యాక్సిడెంట్ వల్ల చిన్నారి రమ్య మరణించి సంగతి తెలిసిందే. ఈ ఘటనను దృష్ట్యా ఇకపై ఏపీలోని అన్ని బార్లలో మైనారిటీ తీరని బాలురకు మద్యం విక్రయించరాదని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.