జగన్ కంటే చంద్రబాబు బెట్టర్, అది ఎన్టీఆర్ చివరి కోరిక: కాంగ్రెస్ నేత, దోస్తీపై కేఈ కొత్త ట్విస్ట్
అమరావతి: జాతీయ పార్టీ కాంగ్రెస్, ప్రాంతీయ తెలుగుదేశం పార్టీలు ఒక్కటవుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలోనే కలిసి పోయాయి. ఇప్పుడు ఏపీలో కూడా కలిసిపోయే దిశగా పయనిస్తున్నాయి. అందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కలవడమే నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో ఏపీలోను కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ ఎఫెక్ట్-చంద్రబాబు ప్లాన్: తెలంగాణలో ఎక్కువ సీట్లు ఎందుకు డిమాండ్ చేయట్లేదు?
తెలంగాణలో పొత్తు నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు చాలా బెట్టర్ అని చెబుతుండగా, టీడీపీ నేతలు తమ అధినేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతుండటం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ సోమవారం అన్నారు. ఏ ఎంపీలకు కూడా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించే ధైర్యం లేదని విమర్శించారు. మోడీ పాలనలో ఐఏఎస్లు, మంత్రులు సొంతగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ వెంటిలెటర్ పైన ఉందని ఆరోపించారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడు లేని విధంగా విదేశీ సంబంధాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, టీడీపీ కలయిక ఎన్టీఆర్ చివరి కోరిక
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కలయిక స్వర్గీయ నందమూరి తారక రామారావు చివరి కోరిక అని చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెయ్యిరెట్లు నయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు అందరూ తిరిగి పార్టీలో చేరాలని కోరారు.
కొత్త ట్విస్ట్ ఇచ్చిన కేఈ కృష్ణమూర్తి
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిస్తే ఉరేసికుంటానని గతంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు. అందుకు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తమ సిద్ధాంతం కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమని ఆయన ట్విస్ట్ ఇచ్చారు. దేశం సంక్షోభంలో ఉన్న ప్రతిసారి టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దేశంలో నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ ప్రమాదకారి అన్నారు.
Recommended Video
సిద్ధాంతం కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమని ట్విస్ట్
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భిన్నవాదనలు ఉన్న పార్టీలు దేశవ్యాప్తంగా ఏకతాటి పైకి వస్తున్నాయని కేఈ చెప్పారు. ఇందులో భాగంగానే టీడీపీ, కాంగ్రెస్ కలిశాయని చెప్పారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సిద్ధాంతం కంటే దేశ ప్రయోజనం ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబును విమర్శించారు, సరే.. మీరేం చేశారు
హరీష్ రావు, కేటీఆర్లు చంద్రబాబుపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత టీ జీవన్ రెడ్డి అన్నారు. చంద్రబాబును విమర్శించే ముందు తెలంగాణలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించేందుకే మహాకూటమి ఆవిర్భవించిందన్నారు. చంద్రబాబు, కోదండరాం, గద్దర్, వామపక్షాలు, విమలక్క లాంటి వారు అంతా ఒక్కటవ్వడం శుభపరిణామం అన్నారు. వీరంతా కలిసి కేసీఆర్ను గద్దె దించటం ఖాయమన్నారు.