ఏపీకి న్యాయం చేయాలని కేంద్రానికి లేదు: ఆజాద్
అమరావతి:ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీని నాలుగేళ్ళు దాటినా ఇంతవరకు నెరవేర్చలేదని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా అవిశ్వాసంపై చర్చ రాకుండా అడ్డుకొంటుందని ఆయన ఆరోపించారు.
రాజ్యసభలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అవిశ్వాసంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అవిశ్వాసంపై చర్చ రాకుండా అడ్డుకొంటుందని ఆజాద్ ఆరోపించారు.
సభ ఆర్డర్లో లేకపోవడానికి కేంద్రమే కారణమని ఆజాద్ అభిప్రాయపడ్డారు ఏపీకి న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హమీలను నాలుగేళ్ళు దాటుతున్నా ఎందుకు అమలు చేయలేదని ఆజాద్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అవిశ్వాసంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని ఆయన ఆరోపించారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను కేంద్ర మంత్రి విజయ్ గోయల్ ఖండించారు. అవిశ్వాసంపై చర్చకు కేంద్రం సిద్దంగా ఉన్నామని మంత్రి విజయ్గోయల్ ప్రకటించారు. అయితే సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేస్తూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు వాయిదా వేశారు.
కావేరీ బోర్డు. బ్యాంకు స్కాంలపై చర్చ జరగాల్సిందేనని ఆజాద్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఏపీకి చెందిన డిమాండ్లపై సభ్యుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని చర్చను చేపట్టాలని ఆజాద్ కోరారు.