సిఎం చంద్రబాబుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ:రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాంగ్రెస్ నేత శైలజానాథ్ భేటీ ఎపి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో శైలజానాథ్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.
దాదాపు పావుగంట సేపు సీఎం చంద్రబాబుతో శైలజానాథ్ చర్చలు జరిపారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై సీఎంతో చర్చించానని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం హైదరాబాద్లోని ఆస్పత్రుల్లో అమలు కావడంలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చానని శైలజానాథ్ చెప్పుకొచ్చారు.
మాజీ ఎమ్మెల్యేల విషయంలో సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్తో తాను ఏపీ సీఎం చంద్రబాబును కలిసినట్టు శైలజనాథ్ చెప్పారు. తాను కాంగ్రెస్ వాదినేనని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. రాజకీయ అంశాలు చంద్రబాబుతో తాను చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శైలజానాథ్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
అయితే నిన్నే మాజీ కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, నేడు మరో కాంగ్రెస్ నేత శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా వరుసగా కాంగ్రెస్ నేతలు సిఎం చంద్రబాబును కలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.