కేసీఆర్ ప్రభుత్వం ఐదేళ్లు కష్టమే: కాంగ్రెస్ నేత, వైయస్లా..: గుత్తా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం అనుమానమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా మంగళవారం హైదరాబాదులో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు కొత్త కాదన్నారు. పార్టీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు పైన దృష్టి సారించినట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా తిరిగి వస్తారన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ దానిని ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోయామన్నారు. తెరాస ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమేనని వ్యాఖ్యానించారు.
అర్హులకు పింఛన్లు ఏవి: షబ్బీర్ అలీ
అర్హులకు పింఛన్లు ఇవ్వడం లేదని షబ్బీర్ అలీ అన్నారు. తమ జిల్లాలో 36 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. తెరాస తాను ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, కాంగ్రెస్ వాదులంతా ఐక్యంగా ఉండాలని డీ శ్రీనివాస్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిలా కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.
తెరాసలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, కేబినెట్లో స్థానం మహిళలకు ఎక్కడ ఇచ్చారని మహిళా కాంగ్రెస్ నేత ఆకుల లలిత ప్రశ్నించారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కరెంట్ లేక, రుణమాఫీ లేక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఏవని ప్రశ్నించారు. తక్కువ ప్రీమియంతో కార్యకర్తలకు భీమా ఇచ్చే యోచన చేస్తున్నట్లు చెప్పారు.
తెరాసలోకి బాలు నాయక్
నల్గొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ మంగళవారం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయనతో పాటు ఆరుగురు ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసులు, 39 మంది ఎంపీటీసీలు, 45 మంది సర్పంచులు కారు ఎక్కారు. బాలు నాయక్ను కేసీఆర్ దేవరకొండ ఇంఛార్జిగా నియమించారు.
తాను బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నానని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. పాత, కొత్త తరం నాయకులు కలిసి పని చేయాలన్నారు. మంచిరోడ్లకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను చేస్తానని చెప్పారు. వాటర్ గ్రిడ్కు నల్గొండ జిల్లాలో శంకుస్థాపన చేస్తామన్నారు. నల్గొండ జిల్లాలో తెరాస విస్తరించాలన్నారు.
తాను జిల్లా అభివృద్ధి కోసమే తెరాసలో చేరానని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అన్నిరకాల అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని చెప్పారు. జిల్లాలో ఏ అభివృద్ధి కావాలన్నా మీ మనిషిగా పని చేస్తానని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలు అన్నదమ్ముల్లా పని చేయాలన్నారు.