"వెంకయ్యకు చంద్రబాబులో నచ్చిందేంటో.. అంతలా ప్రశంసించడానికి!"
విజయవాడ : అమరావతి నిర్మాణంలో భాగంగా.. శుక్రవారం నాడు శాశ్వత భవనాల నిర్మాణానికి ఏపీ సర్కార్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, కార్యక్రమంలో ప్రసంగించిన వెంకయ్య సీఎం చంద్రబాబుపై పలు ప్రశంసలు కురించారు.
ఇప్పుడిదే విషయాన్ని లేవనెత్తుతూ.. పొగడ్తలతో ముంచెత్తేంతా మంచిపని చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య. వెంకయ్యకు చంద్రబాబులో అంతగా ఏం నచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూర్చే విధానాలా? ఓటుకు నోటు కేసులో దొరికిపోవడమా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమా?.. వీటిల్లో వెంకయ్యను అంతలా ఆకట్టుకున్నదేమిటో చెప్పాలన్నారు.
మొత్తంగా వెంకయ్య పొగడ్తలను తీవ్రంగా తప్పుబట్టిన రామచంద్రయ్య.. రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేస్తున్నందేకేనా? చంద్రబాబును అభినందించింది అంటూ నిలదీశారు. కేవలం అరుణ్ జైట్లీని అభినందించాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో శుక్రవారం నాడు శంకుస్థాపన సభ నిర్వహించారని మండిపడ్డారు. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.