అలా చేస్తే వైఎస్కు వెన్నుపోటే.. మగాడివి అనిపించుకుంటావో.. మోసం చేస్తావో : జగన్పై కాంగ్రెస్ నేత
అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు మళ్లీ జగన్ను గెలిపిస్తే.. అప్పుడు రాజధానిని మార్చుకోవచ్చు అన్నారు. కాబట్టి మగాడిలా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడో.. మోసగాడిగా మిగిలిపోతాడో జగన్ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలి పునర్నిర్మాణ బిల్లును తీసుకొస్తే.. ఆయన తనయుడు జగన్ మండలి రద్దు ఆలోచనలో ఉండటం వైఎస్కు వెన్నుపోటు పొడవడమే అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తులసిరెడ్డి మాట్లాడారు.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించిన సంగతి తెలిసిందే. ఆనాడు ప్రతిపక్ష హోదాలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు మద్దతు తెలిపిన జగన్.. ఇప్పుడెందుకు రాజధానిని తరలిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీ మేనిఫెస్టోలో రాజధాని తరలింపు అంశాన్ని ఎందుకు పెట్టలేదని నిలదీస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర,రాయలసీమ వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన వాదిస్తున్నారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలంటే మూడు రాజధానులు ఉండాల్సిందేనని చెబుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పాస్ అవగా.. ఇక మండలిలో బిల్లు సంగతి తేలాల్సి ఉంది. శాసనమండలిలో టీడీపీకే మెజారిటీ ఉన్న రీత్యా.. అక్కడ బిల్లు వీగిపోవడం ఖాయం. కాబట్టి మండలినే రద్దు చేసే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో మండలి రద్దు సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.