ఏపీలో దుష్ట చతుష్టయం, ఆ నాలుగు పార్టీలదే తప్పంతా: తులసిరెడ్డి నిప్పులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దుష్ట చతుష్టయం తయారైందంటూ టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నాలుగు పార్టీలు ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ.. ఏపీకి రూ.5 లక్షల కోట్ల ప్రయోజనాలిచ్చిందని, అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన బీజేపీ అమలు చేయకుండా ద్రోహం చేసిందని తులసిరెడ్డి విమర్శించారు.
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, ఆ ఆగ్రహం తమపై పడకుండా ఉండేందుకే ఇప్పుడు ఆ పార్టీల నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
తప్పు నీదంటే కాదు నీదంటూ.. ఈ నాలుగు రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఏపీకి ఈ నాలుగేళ్లు అన్యాయం చేసింది చాలక, మళ్లీ ముంచాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.