వైఎస్సార్కు జగన్ వెన్నుపోటు.. మండలి రద్దుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన కారణంగా ఏకంగా శాసన మండలినే రద్దు చేసిన సీఎం జగన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. మూడు రాజధానుల విషయంలోగానీ, మండలి రద్దుపైగానీ వైసీపీ చెబుతోన్న కారణాలు అర్థంలేనివని, జగన్వి ముమ్మాటికీ పిచ్చి తుగ్లక్ చర్యలేనని మండిపడింది.
వైఎస్సార్ పునరుద్ధరించిన సభ..
1968లో ఏర్పాటైన ఏపీ శాసన మండలిని 1985లో టీడీపీ సీఎం ఎన్టీఆర్ రద్దుచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్లీ ప్రయత్నాలు ఆరంభించడం, మార్చి 30, 2007న ఏపీ శాసన మండలి పునరుద్ధరణ జరగడం తెలిసిందే. పెద్దల సభ ఉండాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్ ఈ పని చేశారని కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసింది.
తండ్రికి వెన్నుపోటు..
వైఎస్సార్ పునరుద్ధరించిన శాసన మండలి.. ఇప్పుడాయన కొడుకు జగన్ ఆధ్వర్యంలో రద్దు రావడం దురదష్టకరమని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మండలి రద్దు నిర్ణయం ముమ్మాటికీ ఉన్మాద చర్యే అని, తద్వారా తండ్రి వైఎస్సార్ కు జగన్ వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు.
రెండు సభలొద్దు.. మూడు రాజధానులు కావాలా?
రాష్ట్రంలో రెండు చట్టసభలు అవసరం లేదని, ‘ఒక రాష్ట్రం.. ఒక సభ' చాలని సీఎం జగన్ చేసిన వాదనతో తులసిరెడ్డి విభేధించారు. ‘‘ఒకే రాష్ట్రం.. ఒకే సభ.. అంటోన్న జగన్.. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అని మాత్రం ఎందుకనడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతగా వైఎస్సార్ గొప్ప పరిపాలన అందిస్తే.. కొడుకు జగన్ మాత్రం ఉన్మాదిలా, తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడని తులసిరెడ్డి విమర్శించారు.