హోదా పోరాటం ఆపొద్దు: ఏపీ నేతలకు మన్మోహన్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై మరోసారి స్పందించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మన్మోహన్సింగ్ సూచించారు. శనివారం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు తదితరులు మన్మోహన్సింగ్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ ప్రజలను బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మోసం చేసిందని మన్మోహన్కు వివరించారు. దీనిపై మన్మోహన్ స్పందిస్తూ.. ప్రజల కోసం పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని, అధిష్ఠానం నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఇచ్చిన ప్యాకేజీతో ఉపయోగం లేదన్నారు. సెప్టెంబర్ 28న తిరుపతి నుంచి ప్రజా బ్యాలెట్ ప్రారంభించి టిడిపి, బిజెపి కుట్రను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీని స్వాగతిస్తున్నారని ఎంపీ కేవీపీ ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చట్టంలో చెప్పినప్పటికీ రాష్ట్రానికి అప్పగించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. శాసనసభ నియోజకవర్గాల పెంపునకు కేంద్రంతో సీఎం చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని కేవీపీ తెలిపారు.
ప్రత్యేక హోదాను మరుగుపరచడానికి బిజెపి, టిడిపిలు ఇష్టానుసారం తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాయని జేడీ శీలం ఆరోపించారు. ఏపీలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే నేరమనే వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.