మోసకారి: కెసిఆర్ను ఉతికి ఆరేసిన దామోదర, పొన్నాల
మెదక్/ వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యంగా చేసుకుని కాంగ్రెసు తెలంగాణ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్పై శుక్రవారం తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.
కెసిఆర్ పచ్చి మోసకారని, కుటుంబ పరిపాలన సాగించేందుకే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహా అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని రాయికోడ్లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో దళిత నేతను తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని, ముస్లింలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి వమ్ము చేస్తున్నాడని ఆయన అన్నారు.
అడగకుండానే తనంతటతానుగానే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించి ఇప్పుడు మాట మార్చారని ఆయన అన్నారు. ఒకే కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు ఇచ్చి కెసిఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్కు ముఖ్యమంత్రి అయితే దొంగచేతికి తాళం అప్పజెప్పినట్లే అని ఆయన అన్నారు.
అధికారం కోసం అరచేతిలో వైకుంఠం చూపేందుకు యత్నిస్తున్న మాయల మరాఠి కెసిఆర్కు సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ జల్లా రఘునాథపల్లి మండలంలోని ఆయన స్వగ్రామమైన ఖిలాషాపురంలో శుక్రవారం ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన ఘనత సోనియాకు దక్కుతుందన్నారు. కెసిఆర్ అధికారంకోసం అహంకారంగా వ్యవహరించడంవల్లే కాంగ్రెస్, తెరాస మధ్య పొత్తు కుదరలేదన్నారు. తెలంగాణలో 17లోక్సభ స్థానాలలో 15స్థానాలను, వంద అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోవడం ఖాయమన్నారు.