తప్పుడు సమాచారంతోనే: కావూరి, యూటిని..: పనబాక
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించడం అనివార్యమని ఆయన అన్నారు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో రూ. 3కోట్ల 50లక్షల నిధులతో ఏర్పాటు చేస్తున్న పట్టుగూళ్ల పరిశ్రమ కేంద్రం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. మెజార్టీ ప్రజలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుకుంటున్నట్లు కావూరి సాంబశివరావు అన్నారు.
హైదరాబాద్ను యూటీ చేయమని కోరతాం: పనబాక
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కుదరని పక్షంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని కోరతామని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. భద్రాచలంను సీమాంధ్రలో ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు. సీమాంధ్ర ప్రాజెక్టులు, అభివృద్ధిపై పోరాడతామని చెప్పారు.
ఈ నెల 18న కేంద్ర మంత్రుల బృందం ముందు సమైక్య వాదాన్ని వినిపిస్తామని, సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే హైదరాబాద్ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించిందని పనబాక లక్ష్మి చెప్పారు.