ఈ బోడి ప్యాకేజీలేంటి?: జేడీ శీలం, 'చంద్రబాబు చేతకానితనం వల్లే'
అమరావతి: ఏపీ రాష్ట్రాన్ని విభజించిన సమయంలో చేసిన చట్టాన్ని ముందు ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయాలని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. విభజన చట్ట ప్రకారం రైల్వే జోన్ సహా అన్ని హామీలనూ అమలు చేయాలని, అది వదిలేసి ఎప్పుడిస్తారో, ఎలా ఇస్తారో చెప్పకుండా బోడి ప్యాకేజీలేంటని అయన ప్రశ్నించారు.
శుక్రవారం ఉదయం ఆయన మరో మాజీ మంత్రి జైరాం రమేష్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీలంటూ, లక్షల కోట్ల సాయమంటూ ప్రజలను మభ్యపెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయి రెండున్నరేళ్లు గడుస్తున్నా, చట్టంలోని అనేక హామీలింకా అమలు కాలేదని గుర్తు చేశారు.
'చంద్రబాబు చేతకానితనం వల్లే'
ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసీరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పార్లమెంట్ ముందు ధర్నాకు దిగాలని సూచించారు. అలా లేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.