పోలవరంపై కేవీపీ వ్యాఖ్యలు: వైసీపీ, కాంగ్రెస్లు అస్త్రంగా మార్చుకుంటాయా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో ప్రవేట్ మెంబర్ బిల్లు పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తాజాగా పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తున్నారు.
గడచిన ఎన్నికల్లో రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ డిపాజిట్లు కోల్పోయిన నేపథ్యంలో ఆ పార్టీకి జనసత్వాలు నింపే ప్రయత్నంలో భాగంగా ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశాన్ని కేవీపీ తెరపైకి తెచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయమై కేంద్రాన్ని కాస్తంత ఇరకాటంలో పడేశారు.
ఇది చంద్రబాబు నిజ స్వరూపం కాదు, స్వార్థ ప్రయోజనాలు ముగిశాక: ఏకేసిన కేవీపీ
అయితే ఏపీకి హోదా కల్పించే అంశాన్ని రాజ్యసభ పరిధిలో లేదని కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుని లోక్సభ్కు రిఫర్ చేశాలా చేసి కేంద్రం సఫలీకృతం అయింది. అయితే మళ్లీ ఇప్పుడు కేవీపీ కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా భావించి, పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టుని ఎంచుకున్నారు.
అయితే పోలవరంపై ఏ ఉద్దేశ్యంతో పోరాటం చేస్తున్నారో తెలియదు గానీ, దాని వలన కేంద్ర ప్రభుత్వంలో కదలిక ఏర్పడుతోందని మనం తప్పక అంగీకరించాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావడం లేదని, పోలవరం ప్రాజెక్టుని ఆపేయడం కోసం మనకు తెలియకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఊహించిన భయం మొదలైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న కేంద్రం, దానిని పూర్తి చేసేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.
పోలవరంపై ఉమాభారతికి రాసిన లేఖలకు ఎటుంటి సమాధానం రాలేదని, ఆమెకు తాను రాసిన లేఖలు చేరినట్టు అక్నాలెడ్జెమెంట్ అందాయని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే పోలవరం ప్రాజెక్టును ఆపేయాలని కుట్రపన్నుతున్నాయా? అన్న అనుమానం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో దానిని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఆ ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులకి రాష్ట్ర ప్రభుత్వం సరైన లెక్కలు చెప్పడం లేదనే సాకుతో పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేంద్రం విడుదల చేయడం లేదు.
ఏపీకి చెందిన బీజేపీ నేతలు అదే విషయం పదేపదే మీడియా ముందు గట్టిగా ప్రస్తావిస్తున్నప్పటికీ, ఏపి మంత్రులు కానీ టీడీపీ నేతలు గానీ వారి లెక్కల ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా కేంద్రం తగినన్ని నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని ఆరోపిస్తుండటాన్ని మనం చూశాం.
ఈ విధంగా ఏడాది నుంచి టీడీపీ-బీజేపీల మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఆ రెండు పార్టీలు కూడా మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టులో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని దాని నిర్మాణం దిశగా ప్రయత్నాలను మాత్రం చేపట్టలేదు.
అందుకే రెండేళ్లుగా పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రాబోయే మూడు సంవత్సరాలు కూడా టీడీపీ-బీజేపీ నేతలు ఇదే విధంగా ప్రజలను మభ్యపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఏపీకి ప్రత్యేకహోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన వైసీపీ కొంతమేరకు ప్రజల్ని ఆకట్టుకోగలిగింది.
వైసీపీ బంద్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్, వామపక్షాలు కూడా ప్రజలకు చేరువయ్యాయి. పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం లాంటి అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధంగా అలసత్వాన్ని ప్రదర్శిస్తే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీలకు ఇవే గొప్ప ఆయుధాలుగా మారే అవకాశం లేకపోలేదు.