కేంద్రంతో బాబు రహస్య ఒప్పందం: జనసేనకు అనుమానాలు,శ్వేతపత్రంపై వెనక్కి, ప్రజలు క్షమించరు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పు చేయకపోతే శ్వేత పత్రాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రశ్నించారు.
Recommended Video
పోలవరం: నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ, 'ఆ ట్విస్ట్కు కేంద్రానిదే బాధ్యత'
పోలవరం ప్రాజెక్టుపై పలు రాజకీయ పార్టీలు సందేహలను వ్యక్తం చేస్తున్న తరుణంలో కెవిపి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు బుదవారం నాడు లేఖ రాశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తమ అనుమానాలను తీర్చాలని కెవిపి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జనసేనతో పాటు అన్ని పార్టీలకు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనుమానాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదు
తప్పు చేయకపోతే శ్వేత పత్రాన్ని ఎందుకు విడుదల చేయడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రశ్నించారు.అసలు ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటికి పూర్తి చేస్తారని కెవిపి ప్రశ్నించారు.ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కెవిపి బుదవారం నాడు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
కేంద్రంతో రహస్య ఒప్పందాలను ప్రజలు క్షమించరు.
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం రహస్య ఒప్పందాలు చేసుకోంటే ప్రజలు క్షమించరని కెవిపి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.పార్లమెంట్ సాక్షిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని..అయినప్పటికీ జాతీయ ప్రాజెక్ట్ లు ఏవి సకాలంలో పూర్తి కావడంలేదని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.
జనసేనతో పాటు అన్ని పార్టీలకు అనుమానాలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జనసేనతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అనుమానాలు ఉన్నాయని కెవిపి ఆరోపించారు. ఈ అనుమానాలను తీర్చాలని కెవిపి ఆ లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన అనేక కండిషన్స్ ఒప్పుకొంటూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మీ చేతులలలోకి తీసుకొని.. ఎస్టిమేట్స్ ను కేంద్ర అనుమతి లేకుండా, మీకు నచ్చిన రీతిలో పెంచుకొంటూ.. ప్రాజెక్ట్ ను ఈరోజు గందరగోళ పరిస్థికి తెచ్చారని కేవీపీ విమర్శించారు.
కౌంటర్ దాఖలు చేయని పాలకులు
పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆ లేఖలో కెవిపి ప్రస్తావించారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదని కెవిపి చెప్పారు.