జగన్ మా వాడే, మా రాజశేఖర్ రెడ్డి కొడుకు: కాంగ్రెస్తో కలిస్తే తప్పేముంది?
తిరుపతి: కేంద్రంలో ఏ కూటమికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు దక్కబోవని, హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించగలవని భావిస్తోన్న ప్రాంతీయ పార్టీలకు భలే గిరాకీ ఏర్పడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో గానీ, భారతీయ జనతాపార్టీ సారథ్యం వహిస్తోన్న ఎన్డీఏకు గానీ సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీల వెంట పడుతున్నాయి జాతీయ పార్టీలు.
ప్రాంతీయ పార్టీల హవా
ఇందులో భాగంగా- ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టాయి. ఇంకా ఓ దశ పోలింగ్ మిగిలే ఉన్న పరిస్థితుల్లో దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలకు అద్దం పడుతున్నాయి. హంగ్ ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంతనాలు సాగించినట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి. అయిదో విడత ఎన్నికల ముందు నుంచే బీజేపీ.. కొన్ని ప్రాంతీయ పార్టీలను లైనులో ఉంచినట్లు సమాచారం. తాజాగా- కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పోలింగ్ సరళిని అంచనా వేసిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీ రాదని నిర్ధారించుకున్న కాంగ్రెస్.. తాను కూడా ప్రాంతీయ పార్టీల వైపు చూపులు సారించింది.
జగన్ మా వాడే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్న వ్యాఖ్యానాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. `జగన్ మావాడే. మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు..` అంటూ జగన్ను అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వైఎస్ జగన్ మద్దతును తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్సభ సభ్యుడు చింతా మోహన్ స్పష్టం చేశారు. ఇందులో అనుమానాలు అనవసరమని చెప్పారు. సోమవారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు.
కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వం..
ఈ సారి కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వం ఏర్పడుతుందని చింతా మోహన్ జోస్యం చెప్పారు. బీజేపీకి ఈసారి 150కి మించి లోక్సభ స్థానాలు దక్కబోవని, కావాలంటే రాసి పెట్టుకోండని ఆయన సూచించారు. బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, అలాగని కాంగ్రెస్కు కూడా మెజారిటీ స్థానాలు దక్కుతాయని అనుకోవడానికి వీల్లేదని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు హవా చలాయిస్తాయనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఉటంకించారు.
కాంగ్రెస్తో కలిస్తే తప్పేంటి?
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం కావాలంటే- ఎవ్వరినైనా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పైగా- వైఎస్ జగన్ కొత్తవాడేమీ కాదని, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తేనని అన్నారు. జగన్ తమ వాడేనని, రాష్ట్రంలో పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చి, సత్తా చాటిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడని చింతా మోహన్ చెబుతున్నారు. జగన్ కాంగ్రెస్లో చేరితే తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి మెజారిటీ లోక్సభ స్థానాలు దక్కుతాయని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చేది కూడా ఆ పార్టీయేనని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీకి సంబంధం లేదని చింతా మోహన్ అన్నారు.
చంద్రబాబును చూస్తే జాలేస్తోంది..
ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ చంద్రబాబును చూస్తే తనకు జాలి కలుగుతోందని చెప్పారు. పదవిని కోల్పోతున్నానని ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు. 40 ఏళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు ఓ సాధారణ కార్యకర్తలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. తెలుగుదేశం హడావుడీ చేయడాన్ని బట్టి చూస్తోంటే- దేశ రాజకీయాల్లో కొత్తగా ఏర్పాటైన పార్టీలా ఉందని చెప్పారు.