కాంగ్రెస్ కు ప్రథమ శత్రువు వైసిపినే...జగన్ను వదిలి సీఎంను తిడతారా?:కెవిపిపై విరుచుకుపడ్డ కాంగ్రెస్
విజయవాడ:టిడిపిని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రూపొందించిన షార్ట్ ఫిలింపై స్వపక్షం నుంచే ఎదురుదాడి జరగడంతో ఖంగుతిన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల బలోపేతానికి మంగళవారం కాంగ్రెస్ విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఎంపి కెవిపి ప్రదర్శించిన ఒక షార్ట్ ఫిలింలో టిడిపినే లక్ష్యంగా చేసుకొని దుయ్యబట్టడంతో ఈ షార్ట్ ఫిలిం రూపకర్త కెవిపిపై జెడి శీలం తొలుత ఆగ్రహం వ్యక్తం చేయగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతు తెలిపారు. మనకు ప్రధాన శత్రువు వైసిపి అని...వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రదర్శనలు ఎందుకని నిలదీయడంతో ఒక్కసారిగా ఖంగుతిన్న కెవిపి తాను అంత దూరం ఆలోచించలేదంటూ సంజాయిషీ చెప్పారట.
ప్రత్యేక హోదా విషయమై జగన్ ను విమర్శించకుండా వివిధ అంశాలపై ప్రధానంగా చంద్రబాబును, టిడిపిని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపి కెవిపి ఆధ్వర్యంలో రూపొందించిన ఒక షార్ట్ ఫిలింకు స్వపక్షం కాంగ్రెస్ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురయింది. విజయవాడలో జరిగిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల బలోపేతానికి మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన సదస్సుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ, ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
Recommended Video
ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదిదర అంశాలపై అధికార పార్టీ టిడిపి తీరుని లక్ష్యంగా చేసుకొని ఎంపి కెవిపి తాను షార్ట్ ఫిలింని అక్కడ ప్రదర్శించారు. అయితే దీనిని చూసి కాంగ్రెస్ నేతల్లో మిశ్రమ స్పందన ఎదురైంది. ఈ క్రమంలో వేదికపై ఉన్న ఎంపి జేడీ శీలం ఆ షార్ట్ ఫిలింపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
"ఏమిటీ డాక్యుమెంటరీ?...దీని ప్రదర్శన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా?...అంతా సొంత డబ్బాలా ఉంది...పైగా ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉందే తప్ప...జగన్ను ప్రశ్నించేలా లేదు...మనకు చంద్రబాబు ఎంత శత్రువో...జగన్ కూడా అంతే శత్రువు. మన ఓటు బ్యాంకు అంతా వైసీపీలో ఉంది...కాంగ్రెస్ లోకి మళ్లీ వలసలు రావాలంటే వైసీపీ నుంచే రావాలి...అందువల్ల కాంగ్రెస్ కు ప్రథమ శత్రువు వైసీపీనే...వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రదర్శనలు ఎందుకు" అని జెడి శీలం నిలదీశారు.
కెవిపిపై జెడిశీలం ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న క్రమంలో ఆయనకు కొందరు ఇతర కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభించగా, మరికొందరు మౌనందాల్చారు. అయితే ఊహించని ఈ హఠాత్పరిణామానికి ఎంపి కేవీపీ ఖంగు తిన్నారు. ఆ డాక్యుమెంటరీ గురించి తనకు పూర్తిగా తెలియదని దాటవేసే ప్రయత్నం చేశారు. జెడి శీలం చెప్పిన విధంగా తాను ఆ కోణంలో అంత దూరం ఆలోచించలేదని వివరణ ఇచ్చారని తెలిసింది. కాంగ్రెస్ కు మద్దతు విషయంలో టిడిపిలో కొందరు నేతలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో...అలాగే టిడిపికి మద్దతు విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది.