కాంగ్రెస్కు ఎవరి పొత్తూ అవసరం లేదు...ప్రజల మద్దతుతో మళ్లీ అధికారం...తొలిసంతకం హోదాపైనే:ఊమెన్ చాందీ
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ లో ఎవరితోనూ తమకు పొత్తు అవసరం లేదని...తాము ప్రజల అవసరాలు తెలుసుకుని పాలించామని...వారి మద్దతుతోనే తిరిగి రాష్ట్రంలో అధికారం చేపడతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ చెప్పారు.
మంగళవారం గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి చాందీ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది యుపిఎ ప్రభుత్వమేనని, ప్రధానిగా రాహుల్ తొలి సంతకం ఎపికి ప్రత్యేక హోదా పైనేనని ఊమెన్ చాందీ చెప్పారు.
జిల్లాల పర్యటన...గుంటూరు రాక
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ రాష్ట్రంలోని 13 జిల్లాల పర్యటన జరుపుతున్న సంగతి తెలిసిందే. సోమవారం విజయవాడ, మంగళ వారం గుంటూరులో ఆయన పర్యటన జరిపారు. గుంటూరు పర్యటనలో ఆయన రాజీవ్గాంధీ భవన్లో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతల నుంచి ఆయన అభిప్రాయ సేకరణ చేశారు.
ఆతిథ్య, పర్యాటక రంగాల్లో అద్భుత అవకాశాలు: ఇండియాలో 4 కోట్ల ఉద్యోగాలు
కార్యకర్తల ఆవేదన...వినడం కోసమే
కార్యకర్తల సమావేశం సందర్భంగా ఊమెన్ చాందీ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన తెలుసుకోవడానికే తాను ఇక్కడకు వచ్చానని అన్నారు. నేతల స్పీచ్ వినడానికి తాను ఇక్కడకు రాలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పూర్వ వైభవం కార్యకర్తల చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వైసీపీ, జనసేన...ప్రధానిని, కేంద్రాన్ని విమర్శించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. దేశంలో రానున్నది యూపీఏ-3 ప్రభుత్వం అని, ప్రధానిగా రాహుల్గాంధీ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పైనేనని తేల్చిచెప్పారు.
బిజెపి...హోదా ఎందుకు ఇవ్వడం లేదు?
ఎపికి ప్రత్యేక హోదా గురించి ఊమెన్ చాందీ మాట్లాడుతూ..."రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో స్పష్టమైన ప్రకటన చేశారు...కేంద్ర కేబినెట్లో తీర్మానం కూడా ఆమోదించారు...హోదా ఐదేళ్లు చాలదన్న అప్పటి బీజేపీ పెద్దలు...ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు?...రాష్ట్ర అభివృద్ధికి కావలసిన అన్ని నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ చట్టం రూపొందించింది."...అని చెప్పారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ వాటిని పార్లమెంటు సాక్షిగా తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.
రాహుల్ ప్రధాని...రైతు రుణమాఫి
రాహుల్ ప్రధాని అయిన పది రోజుల్లో దేశవ్యాప్తంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరుగుతుందని ఎపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం హోదాతోపాటు కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్, వందశాతం కేంద్ర నిధులతో పోలవరం తదితర విభజన హామీలన్నీ తు.చ. తప్పకుండా అమలవుతాయని చెప్పారు. పార్టీని వీడిన నేతలు త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.