ప్రజా క్షేత్రంలోకి ఏపి కాంగ్రెస్..! రేపటి నుంచే ప్రత్యేక హోదా భరోసా యాత్ర..!
అమరావతి/ హైదరాబాద్ : ఏపిలో పూర్తి నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాన్ని అదిగమించేందుకు ప్రజాకార్యక్రమాల రూపకల్పన చేసుకుంటోంది. నేతలతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఏపి కాంగ్రెస్ భావిస్తోంది. ఏపి ప్రజల మనోభావాలతో పెనవేసుకున్న ప్రత్యేక హోదా హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందనే నినాదంతో మళ్లీ ఏపి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచిస్తోంది ఏపి కాంగ్రెస్. ప్రత్యేక హోదా కలను ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాకారం చేస్తుందని, ఇదే అంశాన్ని ఏపి వ్యాప్తంగా చెప్పేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది ఏపి కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బస్సు యాత్ర రేపు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.
పదమూడు రోజులపాటు ఏపి లోని పదమూడు జిల్లాల్లో నిర్వహించనున్న ప్రత్యేకహోదా భరోసా ప్రజా యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి రేపు ప్రారంభమై మార్చి 3న ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2251 కిలోమీటర్ల పొడవున ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర సందర్భంగా మొత్తం 54 సభలు నిర్వహించాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో పాటు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు రోజుకొకరు చొప్పున యాత్రలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి. రాహుల్ పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదని ఈ నెల 26న లేదా 27న వచ్చే అవకాశముందని ఏపీ పీసీసీ వర్గాలు చెపుతున్నాయి. ప్రియాంక గాంధీ పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి, కేవీపీ.రామచంద్రరావు తదితరులు ఈ యాత్రలో పాల్గొంటారు.