కోట్ల హెచ్చరికతో నంద్యాలలో పోటీకి కాంగ్రెస్ సై, వైసీపీకి దెబ్బెనా?
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాము కూడ పోటీచేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాము కూడ పోటీచేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని కర్నూల్ మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి హెచ్చరించారు.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో టిడిపి, వైసీపీలు గెలుపుకోసం ప్రణాళికలను సిద్దం చేసుకొంటున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలలోనే బస చేసి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ఎనిమిది మంత్రులు నంద్యాలలో కేంద్రీకరించి పనిచేస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ స్థానం నుండి పోటీచేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.అయితే మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి పార్టీ నాయకులను సీరియస్గా హెచ్చరించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
కోట్ల హెచ్చరికల నేపథ్యంలో పోటీపై స్పష్టత
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తామని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ స్థానంలో అభ్యర్థిని బరిలోకి దింపకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ ఎంపి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో రఘువీరారెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో మూడురోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నట్టు చెప్పారాయన. ఎవరిని ఈ స్థానంలో అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
Recommended Video
పోటీ చేయకపోతే దెబ్బే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బతింది. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు డిపాజిట్లు కోల్పోయారు. ఏపీ రాష్ట్రంలో కీలక నేతలు కూడ డిపాజిట్లు కూద దక్కని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసినందుకుగాను కాంగ్రెస్ పార్టీని ఓటర్లు చావుదెబ్బతీశారు.అయితే ఇప్పుడిప్పుడే ఏపీలో తిరిగి కోలుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ పార్టీ విజయవాడలో రాహుల్ సభను ఏర్పాటుచేశారు.ఈ సభలో యూపీఏ పక్షాల జాతీయ నేతలు కూడ పాల్గొన్నారు. అయితే నంద్యాల అసెంబ్లీకి జరిగే ఉపఎన్నికల్లో పోటీచేయకపోతే క్యాడర్ మరింత ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.నంద్యాలలో పోటీచేయాల్సిందేనని కోట్ల సూర్యప్రకాష్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థిని బరిలోకి దింపకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పార్టీ నాయకత్వం ఈ విషయమై స్పందించింది.
ఎవరికీ లాభం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం ఎవరికి లాభం, ఎవరికీ నష్టమనే చర్చ కూడ లేకపోలేదు.ఈ ఎన్నికను అధికార టిడిపి, విపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తే ఏ పార్టీకి చెందిన ఓట్లను చీల్చుతోందనే చర్చ కూడ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు మాత్రం టిడిపికి రావు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు వైసీపీకి టర్న్ అయ్యాయనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే వైసీపీ ఓట్లు చీల్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు పెద్దగా ఓట్లు వచ్చే అవకాశం లేదు. కానీ, తమ ఉనికిని కాపాడుకొనేందుకు మాత్రం పోటీ చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీకి చెందిన ఓట్లను చీల్చడం ద్వారా జగన్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీని లక్ష్యంగా చేసుకొన్న కాంగ్రెస్
ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నాలను చేస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలకనేతలు వైసీపీ, టిడిపి, బిజెపిలలో చేరారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎన్నికల తర్వాత కూడ ఈ వలసలు కొనసాగాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డిఏకు వైసీపీ మద్దతు ప్రకటించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి, వైసీపీ రెండు ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది.ఇటీవల కాలంలో మారిన వైసీపీ వైఖరిని ఎండగట్టడం ద్వారా రాజకీయంగా ప్రయోజనాన్ని పొందే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ భావిస్తోంది.