జైట్లీపై ప్రివిలేజ్ మోషన్: 'జగన్ అధికార దాహం వల్లే రాష్ట్ర విభజన'
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా సాధనలో కాంగ్రెస్ పార్టీ ఇంకో ముందడుగు వేసింది. హోదా విషయంలో రాజ్యసభను తప్పుదోవ పట్టించినందుకు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై సభా హక్కలు ఉల్లంఘన నోటీసు ఇచ్చామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ అన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ జూలై 29న రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందని చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్కు ప్రత్యేకహోదా ఇచ్చేందుకు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎన్డీసీ) ఆమోదం ఇచ్చిందని చెప్పడం అబద్ధమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ రెండు కారణాలతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై సభా హక్కలు ఉల్లంఘన నోటీసు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వొద్దని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని జైరాం రమేష్ ఆరోపించారు.
రాష్ట్ర విభజన పాపం వైసీపీదే: ఎంపీ టీజీ వెంకటేశ్
రాష్ట్ర విభజన పాపం వైసీపీ అధినేత జగన్దేనని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం ఏపీలో సీఎం పదవి కోసం జగన్ కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూశారని ఆయన అన్నారు.
ఆ భయంతోనే తెలంగాణలో తమ పార్టీని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా అనే అంశాన్ని పట్టుకొని జగన్ రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఏపీకి హోదా సాధన దిశగా టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో విభేదిస్తే అసలుకే మోసమని టీజీ చెప్పారు. హోదా కోసం కేవీపీ పోరాటంలో నిజాయితీ ఉందని ఆయన అన్నారు. కానీ హోదాపై కాంగ్రెస్ నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు.
హోదాకు సమానమైన ప్యాకేజీ వస్తే మంచిదేనని అన్నారు. హోదా గురించి చంద్రబాబుపై వైసీపీ అధినేత వైయస్ జగన్ చేయడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విభజన చట్ట ప్రకారం ఏపీకి హోదా, హామీల అమలుకు కేంద్రం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీకి హోదా ఇవ్వకుండా మోసం: మాజీ స్పీకర్ నాదెండ్ల
ఏపీకి హోదా ఇవ్వకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలను మోసం చేస్తున్నాయని ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా వ్వవహరించిన నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ రాష్ట్రానికి హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎంతో అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఏపీకి హోదా విషయంలో సరిగ్గా కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయాలని, అలా జరగని పక్షంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుందని ఆయన అన్నారు.