పార్టీ గోవిందా: జగన్ విడుదలపై జెసి, సంతోషమని గాదె
కాంగ్రెసు పని గోవిందా: జెసి
వైయస్ జగన్ జైల్లో ఉన్నా.. బయట ఉన్నా కాంగ్రెసు పార్టీ పని సీమాంధ్రలో గోవిందా అని మాజీ మంత్రి, అనంతపురం సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఎవరు రాజీనామాలు చేసినా రాష్ట్ర విభజన ఆగదని ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్ప రాష్ట్ర విభజనను ఎవరూ ఆపలేరన్నారు. జగన్తో అయ్యేదేమీ లేదన్నారు. ఆయన ఉన్నా లేకున్నా కాంగ్రెసు పార్టీ పని గోవిందా అన్నారు.
సమైక్యవాది రావడం సంతోషం: గాదె
సమైక్యవాది అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి వస్తుండటం సంతోషకరమైన విషయమని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. ఆయనకు ఎవరి సిఫార్సుతోనే బెయిల్ రాలేదన్నారు. సమైక్యవాదానికి ఎవరు మద్దతు పలికినా తాము స్వాగతిస్తామని చెప్పారు. జగన్కు బెయిల్ స్వాగతిస్తున్నానని, ఆయన సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతారన్నారు.
అధిష్టానం అండతో బెయిల్ రాలేదు: శంకర రావు
జగన్కు బెయిల్ రావడానికి తమ పార్టీ అధిష్టానానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి శంకర రావు అన్నారు. ఆయన కాంగ్రెసు పార్టీతో కలిసి పని చేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చే బాధ్యత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల పైననే ఉందన్నారు.