ముద్రగడ 'కాపు' ఫైట్కు జగన్ మద్దతు: రంగంలోకి కాంగ్రెస్, బాబుకు చిక్కు
విజయవాడ: కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం నిర్వహించి సభకు వెళ్లవద్దని తెలుగుదేశం పార్టీలోని కాంపు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తూ కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని, ముద్రగడ చేపట్టే సభను విజయవంతం చేయాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆదివారం అన్నారు.
కాపులను బీసీల్లో చేర్చే విషయంలో సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్నారన్నారు. ఓ వైపు కాపులను బీసీల్లో చేర్చుతామని మాయమాటలు చెబుతూనే మరోవైపు, చందాలు ఇచ్చి మీటింగులు పెట్టించి బీసీలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ముద్రగడ కాపు గర్జనకు చంద్రబాబు కౌంటర్: రంగంలోకి సినీ దర్శకుడు వివి వినాయక్
ఆదివారం విజయవాడలో జరిగిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సదస్సులో రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చాయన్నారు. అధికారంలోకి వచ్చిన టిడిపి - బిజెపి ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు.
రాజకీయంగా ఏకగ్రీవ ఆమోదం ఉన్నందున చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి ఫిబ్రవరి నెలాఖరుకల్లా పార్లమెంటుకు పంపితే కాంగ్రెస్ పార్టీతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలు మద్దతిస్తాయన్నారు. కాపులను బీసీల్లో చేర్చే దిశగా కృషి చేసేందుకు కాంగ్రెస్లో కాపు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న ముద్రగడ సభకు అందరూ వెళ్లాలని, విజయవంతం చేయాలన్నారు. కాపుల కోసం ఫైట్ చేస్తున్న ముద్రగడకు తాము అండగా ఉంటున్నామని వైయస్ జగన్ ఇటీవల దాసరి నారాయణ రావుతో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముద్రగడకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం. ముద్రగడకు ఇరు పార్టీలు మద్దతివ్వడం చంద్రబాబును చిక్కుల్లో పెట్టేందుకే అంటున్నారు.
వాస్తు పేరుతో అన్యాయం: ఉమ్మారెడ్డి
నూజివీడులో ప్రభుత్వ భూమి 55వేల ఎకరాలు ఉన్నప్పటికీ వాస్తు పేరుతో భూములు లాక్కొని చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని వైసిపి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రావు ఆదివారం మండిపడ్డారు. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు లాక్కొని, వాటిని 99 ఏల్లు పరాయి దేశానికి అప్పగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.