అమరావతా? మూడు రాజధానులా? : దానికే జై కొట్టిన కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేష్
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై అన్ని పార్టీలు తమ వైఖరిని ప్రకటించినా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ నేత,మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మూడు రాజధానులు సాధ్యమయ్యే పని కాదన్నారు. రాజధానిగా అమరావతి అయితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ,సచివాలయం వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పరిపాలనకు ఆటంకాలు ఏర్పడుతాయన్నారు.
1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడినప్పుడు గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ అమరావతికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నా.. ఆ పార్టీ అధిష్టానం మాత్రం రాజధానిపై తమ వైఖరిని స్పష్టం చేయలేదు.
వైసీపీ ప్రభుత్వం రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే కాంగ్రెస్ దానిపై స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికైతే పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలు మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకించారు. ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్న డిమాండ్కు అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే, రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న పోరాటాన్ని వైసీపీ నేతలు,మంత్రులు పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇది రాష్ట్ర సమస్య కాదని,కేవలం అక్కడి 29 గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలు మాత్రమేనని మంత్రులు కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అమరావతిలో రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని.. అన్ని ప్రాంతాలను సమ అభివృద్ది చేయడమే తమ లక్ష్యం అని బొత్స తాజాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం లక్ష కోట్లు అప్పు తెచ్చానని చెబుతున్న చంద్రబాబు.. రాజధాని కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తాత్కాలిక భవనాలే కట్టారని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అమరావతి రైతులు చంద్రబాబు ట్రాప్లో పడవద్దని, వైసీపీ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.