పాఠ్య పుస్తకాల్లో సోనియా: కేసీఆర్కు లేఖ, బలంగా లేం కానీ: తుమ్మల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక పాఠంగా చేర్చాలని తాము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ సోమవారం చెప్పారు.
భూసేకరణ బిల్లులో సవరణల వల్ల కలిగే నష్టాలపై తెలంగాణ కాంగ్రెస్ బుక్లెట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీఎస్ తదితరులు మాట్లాడారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్కు దూరమైన వర్గాలను దరిచేర్చుకునేందుకు డీఎస్ అధ్యక్షతన కమిటీ వేసినట్లు చెప్పారు.
తెలంగాణ ఇవ్వడం వల్లే సెటిలర్లకు కాంగ్రెస్పై నమ్మకం సన్నగిల్లిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీల వల్లే మైనారిటీలు కాంగ్రెస్కు దూరమయ్యారన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కలిగిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ నుండి విద్యుత్ కోతలుండవ్: తుమ్మల
ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి విద్యుత్ కోతలు ఉండవని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో అన్నారు. ప్రణాళికా లోపం వల్లే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిందన్నారు. దానిని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిగమిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీలో తమ పార్టీ కొంత బలహీనంగా ఉందనేది వాస్తవమే అన్నారు.
వీటిని అధిగమిస్తామన్నారు. జూన్ నాటికి పుష్కరాల పనులు పూర్తవుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆఱ్ ప్రణాళికలతో కాంగ్రెస్ పార్టీ కోమాలోకి వెళ్లిపోవడం ఖాయమన్నారు. వరంగల్, కొత్తగూడెంలలో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. వరంగల్ ఎయిర్ పోర్టు విషయమై ఇప్పటికే అడిగామన్నారు.