రాయల టి వెనక శక్తులు, యత్నాలు నెరవేరవు: డిఎస్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కొత్త ప్రతిపాదనల వెనక కొన్ని శక్తులు ఉన్నాయని, అలాంటి వాళ్ళ ఆశలు నెరవేరవని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాయల తెలంగాణ ప్రచారం ఓ కుట్ర మాత్రమేనని అన్నారు. 2014 లోపు తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
పది జిల్లాల తెలంగాణనే కావాలని కోరుకుంటున్నట్లు డిఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించదని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుంటారని, మెజార్టీ అవసరం లేదని శ్రీనివాస్ తెలిపారు. అసెంబ్లీలో మెజార్టీకి, తెలంగాణ బిల్లుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
రాయల తెలంగాణకు ఒప్పుకోం: విద్యాసాగర్, దిలీప్
రాయల తెలంగాణ ప్రతిపాదనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తేల్చి చెప్పారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయల ప్రతిపాదన కాంగ్రెస్ రాజకీయ ఎజెండా అని విద్యాసాగర్ రావు మండిపడ్డారు.
కాగా రాయల తెలంగాణకు ఒప్పుకునే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్రీయ్ లోక్దళ్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ రాజకీయ జెఏసి, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా వ్యతిరేకించాలని ఆయన కోరారు. హైదరాబాద్ భూకబ్జాదారుల్లో రాయలసీమ వారే ఎక్కువగా ఉన్నారని దిలీప్కుమార్ ఆరోపించారు.