మంత్రుల వ్యాఖ్యలు: జగన్ దీక్షపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారా?
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్షపై అనుమానాలు కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. జగన్ నిరవధిక నిరాహార దీక్షపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
సోమవారంనాటికి జగన్ దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీంతో జగన్ శరీరంలో షుగర్ లెవల్ తగ్గింది. బిపి, పల్స్ రేట్ పడిపోయాయి. బరువు తగ్గారు. ఈ స్థితిలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేయలేదు. దాంతో జగన్ శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగాయని ఓ వర్గం మీడియా వ్యాఖ్యానించింది.
దాంతో జగన్ దీక్షపై అనుమానానాలున్నాయని మంత్రులు కామినేని శ్రీనివాస రావు, పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం షుగర్ లెవల్స్ 59 ఉండగా, మధ్యాహ్నానికి 83కు చేరిందని మంత్రులు అన్నారు. జగన్ ఆహారం లేదా ఇన్సులిన్ తీసుకుని ఉంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రుల వ్యాఖ్యలను కొన్ని టీవీ చానెళ్లు అదే పనిగా ప్రసారం చేశాయి.
మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో హెల్త్ బులిటెన్ విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గుంటూరు ప్రభుత్వాస్పత్రి అధికారులను నిలదీశారు. నాలుగు రోజుల వివరాలు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, నాలుగు రోజుల వైద్య పరీక్షల వివరాలు లేవని వారు చేతులెత్తేశారు. ఆరోగ్య శాఖ మంత్రి వద్ద ఆ వివరాలు ఎలా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆస్పత్రి అధికారులను నిలదీశారు. ఆ విషయం తమకు తెలియదని వారు చెప్పారు.
తాము రక్తం సేకరించిన రెండు గంటల తర్వాత పరీక్షలు నిర్వహించడం వల్లనే హెచ్చుతగ్గులు వచ్చాయని గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఇంచార్జీ సూపరింటిండెంట్ ఉదయ్ కుమార్ చెప్పారు. తాము తీసుకుని వెళ్లిన గ్లూకో మీటర్తో పరీక్షించినప్పుడు 88 చూపించగా, పక్కనే ఉన్న కొత్త గ్లూకో మీటర్తో పరీక్షించినప్పుడు 77గా చూపించిందని అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ అన్నారు.
మంత్రుల వ్యాఖ్యలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు .మీడియా సమక్షంలో శాంపిల్స్ తీసుకుని పరీక్షించాలని ఆయన సవాల్ చేశారు.