రూ.1000 కోట్ల విశాఖ డైరీ ఫాం భూముల స్వాహాకు కుట్ర: మంత్రి అయ్యన్న
విశాఖపట్నం: విశాఖపట్నంలో సుమారు రూ.1000 కోట్ల విలువైన డైరీ ఫాం భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి విశాఖ డైరీ ఫాం ఈఓ సూర్యప్రకాశరావే నని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపిస్తున్నారు. నర్సీపట్నం లోని తన స్వగృహంలో మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు.
ఈ భూముల స్వాహా విజయవంతంగా పూర్తిచేసేందుకు ప్రణాళిక లో భాగంగా విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం(డీఎల్డీఏ) కమిటీ సమావేశాన్ని గోవాలో సీక్రెట్ గా ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అయ్యన్న తెలిపారు. ఈ ల్యాండ్ స్కామ్ గురించి ఏడాదిన్నర క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశామని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
స్కామ్ గురించి...సిఎంకు ఫిర్యాదు
పశువుల వీర్య కణాల బ్యాంక్(సెమన్ బ్యాంక్)ను అభివృద్ధి చేయడం కోసం నిర్దేశించిన విలువైన విశాఖ డైరీ ఫాం భూములను స్వాహా చేసేందుకు కొందరు కుట్ర పన్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఈ విషయం గురించి పశ్చిమగోదావరి జిల్లా డీఎల్డీఏ ఛైర్మన్ గాంధీ తనకు తెలియజేశారని మంత్రి అయ్యన్న తెలిపారు. దీంతో అప్రమప్రతమైన తాను రాష్ట్రంలోని ఇతర డీఎల్డీఏ ఛైర్మన్లతో కలిసి 18 నెలల క్రితం సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసినట్లు మంత్రి అయ్యన్న తెలిపారు. దీనిపై సిఎం చంద్రబాబు వెంటనే స్పందించి అధికారులకు హెచ్చరికలు జారీచేశారన్నారు.
కుంభకోణానికి...గోవాలో స్కెచ్
విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం(డీఎల్డీఏ) కొత్త కమిటీకి ఛైర్మన్గా చెప్పుకుంటున్న గాడు వెంకటప్పడు ఈ విశాఖ డైరీ ఫాం భూములను స్వాహా చేసేందుకు గాను మార్చి 18న తనకు అనుకూలమైనవారిని సీక్రెట్ గా గోవా తీసుకువెళ్లి అక్కడ కమిటీని ఏర్పాటుచేసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో డీఎల్డీఏ ఈఓ సూర్యప్రకాశరావు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు.
ఆధారాలు...ఉన్నాయి...
వీరంతా గోవా వెళ్లినట్లు రుజువుచేసే విమానం టిక్కెట్లతో సహా పలు ఇతర ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అసలు విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కమిటీని ఇంత రహస్యంగా నియమించాల్సిన అవసరం ఏమిటని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కేవలం ఇన్ఛార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా డైరీ భూములు స్వాహా చేసేందుకే ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
కీలక సూత్రధారి...ఈవో నే!
ఈ భూముల స్కామ్ వెనుక కీలక సూత్రధారి విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంఘం ఈఓ సూర్యప్రకాశరావేనని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈవో సూర్యప్రకాశరావుపై ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయని, డైరీ లోని మహిళా ఉద్యోగులు 6 నెలల కిత్రం డైరీ లోని మహిళా ఉద్యోగులు సీఎంను కలిసి ఈఓ సూర్యప్రకాశరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసిందన్నారు. ఈవోపై క్రమశిక్షణా చర్యలకు సీఎం ఆదేశించారని, ఈక్రమంలో ఆయనను విజయనగరం బదిలీ చేసినట్లే చేసి మళ్లీ కొద్దికాల వ్యవధిలోనే విశాఖపట్టణానికి తీసుకువచ్చారని మంత్రి అయ్యన్న వివరించారు.
పాడిపరిశ్రమపై...అవగాహన ఉన్నవారినే
రియల్ ఎస్టేట్ వ్యాపారి గాడు వెంకటప్పడుకు పాడి పరిశ్రమపై అవగాహన లేదని, ఈ క్రమంలో ఆయనను డైరీ ఫాం భూముల కుంభకోణంలో ఇరికించేస్తారేమోనని అనుమానంగా ఉందని మంత్రి అయ్యన్న చెప్పారు. డిఎల్డిఎ నిబంధనల ప్రకారం కమిటీకి నియోజకవర్గానికి ఒక డైరెక్టరు చొప్పున నియమించాలని, అలాగే పాడి పరిశ్రమపై అవగాహన ఉన్నవారినే కమిటీ ఛైర్మన్గా ఎంపికచేయాలని మంత్రి అయ్యన్న తెలిపారు.
కుట్రకు...అడ్డుకట్ట పడాలి
వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భూములను అతి చౌకగా కేవలం రూ. 10 కోట్లుకే కొట్టెయ్యాడానికి అతి పెద్ద కుట్ర జరుగుతోందని, ఈ కుట్రకు అడ్డుకట్ట పడాలనేదే తన అభిమతమని మంత్రి అయ్యన్న వివరించారు. వాస్తవాలు ఇవైతే వీటిన్నింటిని పక్కనపెట్టి ఇదేదో ఇద్దరు ఇద్దరు మంత్రుల మధ్య విభేదాల్లాగా ప్రచారం చేస్తున్నారని, ఇది కూడా కుట్రలో భాగమేనని మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు.