ఇదివరకు లేనిది ఇప్పుడే ఎందుకు.. ఆలయాల దాడులపై మంత్రి బొత్స
ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో కొందరు భాగస్వాములు ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని ఫైరయ్యారు.
రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు నిదర్శనం అని బొత్స సత్యనారాయణ తెలిపారు. కావాలనే దాడులు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. జన సంచారం లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని బొత్స చెప్పారు. ప్రజల్లో అలజడి సృష్టించడానికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుశ్చర్యలకు పాల్పడి అల్లర్లు సృష్టిస్తున్నారని.. జరిగే ఘటనలను ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తుందని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలంతా ఒకటే అనే భావనతో మత సామరస్య కమిటీలు వేశామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కానీ కుట్రపూరితంగా దాడులకు తెగబడటం ఏంటీ అని ప్రశ్నించారు. రామతీర్థం ఘటన సమయంలో సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన ఉందని గుర్తుచేశారు. పేదలకు ఇళ్ల పంపిణీని పక్కదారి పట్టించడానికే రాముని విగ్రహం ధ్వంసం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఈ తరహా ఘటనలు జరగలేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పుడే ఎందుకు జరిగాయో అర్థం చేసుకోవాలన్నారు. నిజా నిజాలు త్వరలో తెలుస్తాయని చెప్పారు. కానీ తప్పుచేసిన వారిని వదలబోమని స్పష్టంచేశారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.