హత్యాయత్నం... శ్యామ్ కె నాయుడిపైనే అనుమానం... విజయవాడ పోలీసులకు నటి ఫిర్యాదు...
టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీసుధ విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్పై తన కారును ఢీకొట్టి హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక శ్యామ్ కె.నాయుడు హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తాను శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసుకు,ఈ ఘటనకు లింకు ఉందని ఆమె పేర్కొన్నారు. శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీసుధ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అడ్డు తొలగించుకునేందుకు కుట్ర...
శ్యామ్ కె నాయుడు తన అడ్డు తొలగించుకునేందుకు యాక్సిడెంట్లో తనను చంపేసేలా కుట్ర చేసి ఉంటాడని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మే 26న శ్రీసుధ మొదటిసారి ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా శ్యామ్ కె.నాయుడు బెయిల్ పొందారని రెండోసారి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో ఆయన బెయిల్ కూడా రద్దయింది.
స్నేహితులతో కలిసి బెదిరించాడని...
గత నెలలో హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసులకు శ్యామ్ కె నాయుడుపై ఆమె మరోసారి ఫిర్యాదు చేశారు. గతేడాది అగస్టు 5న మాదాపూర్లోని సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా నివాసానికి పిలిపించి శ్యామ్ కె నాయుడు,చిన్నా,సాయిరాం మాగంటితో పాటు మరికొందరు తనను బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను దూషించడంతో పాటు,శారీరకంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే రాజీపడక తప్పదని హెచ్చరించినట్లు చెప్పారు.
గతంలో ప్రాణభయం ఉందన్న శ్రీసుధ..
భయంతోనే బెదిరింపుల విషయాలేవీ తాను బయటపెట్టలేదని... కానీ శ్యామ్ కె నాయుడు కుటుంబ సభ్యులతో ప్రాణభయం ఉన్నందునా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అప్పట్లో శ్రీసుధ తెలిపారు. శ్యామ్ కె. నాయుడిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. శ్రీసుధ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మాదాపూర్ పోలీస్ స్టేషన్కు కేసును బదిలీ చేయనున్నట్లు అప్పట్లో తెలిపారు.