హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానం! కానిస్టేబుల్తో ఆహ్వాన పత్రం పంపిన ఉన్నతాధికారులు?
Recommended Video
విజయవాడ: డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోం మంత్రి చినరాజప్పకు ఘోర అవమానం జరిగింది. ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ శంకుస్థాపనకు పోలీసు ఉన్నతాధికారులు ఒక కానిస్టేబుల్తో ఆహ్వానపత్రం పంపించడంతో ఆయన నిర్ఘాంతపోయారు.
ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హోం మంత్రి చినరాజప్ప హాజరు కాలేదు.
ఆయన విజయవాడలోనే ఉండీ కార్యక్రమానికి ఎందుకు రాలేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. శంకుస్థాపన ఆహ్వానపత్రికను మొక్కుబడిగా కార్యాలయంలోని సిబ్బంది చేతికి ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలీసు ఉన్నతాధికారుల తీరుతో నొచ్చుకున్న హోం మంత్రి చినరాజప్ప ఈ కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సదరు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రంలోపు చినరాజప్పతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భూమి పూజ కార్యక్రమలో మంత్రి నారాయణ, స్థానిక నేతలు, డీజీపీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.