వైసీపీలో కొనసాగుతున్న చేరికలు..! జాతరను తలపిస్తున్న లోటస్ పాండ్..!! 16నుండి బస్సు యాత్ర..!!
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ చిన్నపాటి జాతరతను తలపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుండి పెద్దామ చిన్నా తేడా లేకుండా జై జగన్ అంటున్నారు నాయకులు. కొద్దిరోజులుగా వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా ఎన్నికల నామినేషన్ కు సమయం దగ్గర పడుతుండడంతో చేరికల తాకిడి రెట్టింపయ్యింది. ఎంపీలు ఎమ్మెల్యేల తేడా లేకుండా సగన్ చేత కండువా కప్పించుకుంటున్నారు నాయకులు.
హైదరాబాద్లోని లోటస్పాండ్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి సమక్షంలో రాజకీయ, రాజకీయేతర నేతలు వైసీపిలో చేరిపోయారు. ప్రముఖ సినీ నటులు కూడా జగన్ సమక్షంలో వైసీపిలో చేరారు. ఇప్పటికే పృథ్వి, కృష్ణుడు, భానుచందర్, జయసుధ, అలీ వంటి నటులు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం విథితమే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధి నేత జగన్ ఈ నెల 16న బస్సు యాత్ర సందర్బంగా ఇడుపుల పాయలో 75 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. తరువాత మూడు రోజల్లో రోజుకు పాతిక మంది చొప్పున అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. జాబితా మొత్తం సిద్ధమైందని, విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తామని పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
పార్టీలో రెబెల్స్, అసంతృప్తులు ఉన్నా పెద్దగా నష్టమేమి లేదని, అన్నీ సర్దుకుంటాయని ఆయన చెప్పారు. నామినేషన్ల దాఖలుకు స్వల్ప సమయం ఉండడం, పోలింగ్ కు నెల రోజుల కన్నా తక్కువ గడువు ఉండడంతో అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక బస్సు యాత్రతో పాటు పార్టీ ప్రచార కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.