అరేయ్, నాది జమ్మలమడుగు, బాంబులేస్తా: అధికారిని కాలితో ఎగిరెగిరి తన్ని కాంట్రాక్టర్ రౌడీయిజం
అనంతపురం: 'నాది కడప జిల్లా.. జమ్మలమడుగు.. నాతో పెట్టుకోవద్దు. నాకు తిక్కరేగితే బాంబులు తెచ్చి మీ ఆఫీసు మీద వేస్తా' అని ఓ కాంట్రాక్టర్ మున్సిపల్ డీఈ, ఏఈ పైన రెచ్చిపోయాడు. ఈ సంఘటన ఏపీలోని అనంతపురంలో చోటు చేసుకుంది.
చేతకానివాళ్లకు పెళ్లెందుకు: 'శాడిస్ట్ మొగుడు'పై నన్నపనేని, విచారణలో రాజేష్ ఆసక్తికర విషయాలు
ప్రభుత్వ అధికారులపై రెచ్చిపోయిన ఆ కాంట్రాక్టర్ నరసింహా రెడ్డి. బాధిత అధికారుల్లో డీఈ కిష్టప్ప ఉన్నారు. అందరి ముందు ప్రభుత్వ అధికారిని కిందపడేసి మరీ బెదిరించాడు కాంట్రాక్టర్. కాలితో తన్నాడు. ఈ ఘటనలో కిష్టప్పకు గాయాలయ్యాయి. అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల అదుపులో నరసింహా రెడ్డి
పోలీసులు నరసింహా రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులను బెదిరించి, వారిపై దాడి చేసిన కాంట్రాక్టర్ నరసింహా రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేయర్ స్వరూప డిమాండ్ చేశారు. అతను ప్రభుత్వ అధికారులపై దాడి చేయడం విడ్డూరమని ఆమె మండిపడ్డారు.
కొట్టి, చంపేస్తామని బెదిరింపులు
ప్రభుత్వ అధికారిపై కాంట్రాక్టు దాడి నేపథ్యంలో మున్సిపల్ అధికారులు మంగళవారం నిరసనకు దిగుతున్నారు. కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారి వద్దకు వచ్చి కొట్టి, చంపేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీస్తున్నారు.
వేధింపులు అని విమర్శలు
నరసింహా రెడ్డి కాంట్రాక్ట్ బిల్లుల క్లియరెన్స్ విషయమై ఈ గొడవ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నరసింహా రెడ్డికి రావాల్సిన రూ.15 లక్షలు పక్కన పెట్టి అధికారులు లంచం అడుగుతున్నారనేది నరసింహా రెడ్డి వర్గం వాదనగా ఉంది. బిల్లుల క్లియరెన్స్కు అధికారులు వేధింపులే కారణమని అంటున్నారు. అయితే, అదంతా అబద్దమని, దాడిని తక్కువ చేసి చూపేందుకు ఇలా ఆరోపణలు గుప్పిస్తున్నారని అధికారులు అంటున్నారు.
రేయ్ అంటూ కాలితో తన్నాడు
ఈ దాడి ఘటన సోమవారం రాత్రి జరిగింది. రేయ్ అంటూ అధికారిని బెదిరిస్తూ కాలితో తన్నడం కలకలం రేపుతోంది. అధికారిని ఎగిరి ఎగిరి తన్నాడు. కిష్టప్ప అనంతపురం నగరపాలక సంస్థలో డిప్యూటీ ఇంజినీరుగా పని చేస్తున్నారు.
ఆరోపణలు రావడంతో బిల్లుల నిలిపివేత
నరసింహా రెడ్డి చెత్త ఊడ్చే యంత్రాన్ని నగరపాలక సంస్థకు సరఫరా చేసిన కాంట్రాక్టర్. ఈ యంత్రంపై అనేక ఆరోపణలు రావడంతో బిల్లుల చెల్లింపు నిలిపేశారు. రెండు నెలల కిందట రూ.23 లక్షలు చెల్లించారు. మరో రూ.15 లక్షల వరకూ బిల్లు చెల్లించాల్సి ఉంది. చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారని విమర్శిస్తూ ఆ గుత్తేదారుడు నరసింహా రెడ్డి సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి పలువురు ఇంజినీర్లను దుర్భాషలాడాడు.
మధ్యలో జోక్యం, మందలించే ప్రయత్నం
అక్కడే ఉన్న డీఈ కిష్టప్ప జోక్యం చేసుకొని సభ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. నువ్వెవరు చెప్పడానికి అంటూ ఎదురు తిరిగాడు. పరుషంగా మాట్లాడాడు. అక్కడే ఉన్న ఉప కమిషనర్ సన్యాసిరావు, కార్యదర్శి జ్యోతిలక్ష్మి మందలించే ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి అడ్డుకొని బయటకు లాక్కెళ్లారు.
బైక్పై వెళ్తుండగా దాడి
ఇది జరిగిన గంట తర్వాత డీఈ కిష్టప్ప బైక్ పైన ఇంటికి వెళ్తుండగా రఘువీరా టవర్స్ వద్ద నరసింహా రెడ్డి ఆయనను అడ్డుకున్నాడు. రోడ్డు పైనే విచక్షణరహితంగా కొట్టాడు. తనను కొట్టవద్ది ప్రాదేయపడినా వినలేదు. దాంతో ఆయన ఈ వ్యవహారంపై వన్టౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు.