విజయ్ మెర్సల్ మూవీ: మోడీపైనే కాదు, చంద్రబాబు ప్రభుత్వంపైనా
హైదరాబాద్: తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపైనే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో ఆస్పత్రుల దుస్థితిపైనా తీవ్ర వ్యాఖ్యలున్నాయి. మోడీ విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు ఉండడంతో మెర్సల్పై బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
మెర్సల్ సినిమాలో విజయ్ పోషించిన పాత్ర ఓ మీడియా సమావేశంలో మాట్లాడినట్లు చెప్పే సంభాషణే వివాదానికి కారణమైంది. అయితే, ఆ సినిమాలో మోడీ విధానాలపైనే కాకుండా ఆస్పత్రుల తీరుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు ఉన్నాయి.
నిజానికి, నాలుగు దృశ్యాలను ఎడిట్ చేయడానికి నిర్మాతలు అంగీకరించినట్లు, ఎడిట్ చేయడానికి ముందే ఏ దృశ్యం లీకయినట్లు తెలుస్తోంది. దుమారం చెలరేగింది. అయితే, సినిమాలో ఆ డైలాగులు చాలా వరకు ఉన్నాయి. ఈ నెల 27వ తేదీన మెర్సల్ తెలుగు వెర్షన్ విడుదలవుతోంది.
మోడీ జిఎస్టీపై ఇలా....
మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జిఎస్టీ)పై వెట్రీ పాత్ర తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సింగపూర్ ప్రభుత్వం కేవలం 7 శాతం జిఎస్టీ మాత్రమే వసూలు చేస్తోందని, మన ప్రభుత్వం 28 శాతం వసూలు చేస్తోందని, సింగపూర్ ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని ఆ పాత్ర ఆవేశంగా మాట్లాడుతుంది. మన ప్రభుత్వం మాత్రం మెడిసిన్స్పై 12 శాతం జిఎస్టీ విధిస్తూ, మద్యాన్ని జిఎస్టీ నుంచి మినహాయించడమేమిటని అడుగుతుంది.
గోరఖ్పూర్ సంఘటనపై....
ఆస్పత్రుల తీరుపై వెట్రీ పాత్ర చేత తీవ్రమైన వ్యాఖ్యలు చేయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండకపోవడంపై వెట్రీ పాత్ర తీవ్రమైన విమర్శలు చేస్తుంది. వెట్రీ పాత్రను విజయ్ పోషించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకపోవడంతో వారు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాను ఆపేశారని అంటూ గోరఖ్పూర్ ఆస్పత్రిలో పిల్లలు చనిపోయిన ఉదంతాన్ని ఆ పాత్ర ప్రస్తావిస్తుంది.
గుంటూరు ఆస్పత్రి సంఘటనపై....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును ఎలుక కొరికిన సంఘటనపై కూడా వెట్రీ దుమ్మెత్తిపోస్తాడు. ఆ సంఘటనను సినిమాలో వాడుకున్నారు కూడా. ప్రభుత్వాస్పత్రులకు కరెంట్ సరఫరా ఉండడం లేదని, కరెంట్ కోత వల్ల ఆస్పత్రుల్లో మరణాలు సంభవిస్తున్నాయని కూడా ప్రస్తావిస్తాడు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని అంటాడు. వీటన్నింటికీ ప్రభుత్వ విధానాలే కారణమ ని ఎత్తిచూపినట్లవుతోంది.
బిజెపి విమర్శ ఇదీ....
ప్రభుత్వ పథకాలపై మెర్సల్ సినిమాలో వ్యాఖ్యలు చేయడంపై బిజెపి తమిళనాడు రాష్ట్రాధ్యక్షులు తమిలిసాయి సౌందర్రాజన్ దుమ్మెత్తిపోశారు. తమిళ సినీ నిర్మాతల తీరుపై కూడా ఆయన మండిపడ్డారు. జంతువుల వాడుకునే విషయంలో చట్టాలను ఉల్లంఘించే సినీ వర్గాలకు ప్రభుత్వ పథకాలను విమర్శించే హక్కు లేదని అన్నారు. జిఎస్టీ గురించి లేదా ఆర్థికపరమైన తీరుతెన్నుల గురించి నిర్మాతలకు ఏం తెలుసునని అడిగారు.