చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం వైసీపీ నేతలకు తప్పుడు నిర్ణయమైందా?
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న విదేశీ పర్యటన నిర్ణయంపై ప్రతిపక్షం వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం రాష్ట్ర ప్రజలు ఇంత పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుంటే చంద్రబాబు తన కుటుంబంతో విదేశీ పర్యనటకు వెళ్లడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన నేపథ్యంలో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు తన సొంత ఇమేజ్ని తానే డామేజ్ చేసుకోవడానికి కుటుంబంతో కలిసి వారం రోజులు విదేశీ పర్యటనకు బయర్దేరారనే విమర్శ వినిపిస్తోంది.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వంలో కొనసాగుతున్న చంద్రబాబు తన వైఖరిని చెప్పకుండా ఇలా చెప్పాపెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లడం బాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని విపక్షాలతో పాటు ఏపీ ప్రత్యేకహోదా సాధన కోసం చలసాని లాంటి వారు నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకునే వారే లేరని, చంద్రబాబు సైతం దీనిపై మాట్లాడకపోవడం దురదృష్టకరమంటున్నారు.
సోమవారం విజయవాడలో వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం కరువుతో అల్లాడుతుంటే విహారయాత్రలకు సీఎం బయలుదేరడం వెనుక ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తోందని అన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు తీరు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉందని అంటున్నారు.
విదేశీ పర్యనటకు ముందు చంద్రబాబు ఈ అంశంపై తానేమి చేయదలచుకున్నారో కాస్తంత ప్రజలకు స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. దాదాపు వారం రోజుల పాటు రాష్ట్రంలో ఆయన అందుబాటులోకి ఉండటం లేదు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు పయనమైన సంగతి తెలిసిందే.
చంద్రబాబు వ్యక్తిగత పర్యటనగా పేర్కొంటున్న ఈ విదేశీ పర్యనటలో ఆయనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్లు ఆయన వెంట వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కుటుంబం థాయ్లాండ్, స్విట్జర్లాండ్లో గడపనున్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడకు చేరుకుంటారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం నిత్యం పరిపాలన, రాజధాని నిర్మాణ పర్యవేక్షణ, మంత్రులు ఉద్యోగులతో సమీక్షలు లాంటి వాటి నుంచి కాస్తంత పని ఒత్తిడిని తప్పించుకునేందుకు విదేశీ పర్యనటకు వెళ్లారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.