180 ప్రశ్నల్లో 81 జవాబులు తప్పే:ఎగ్జామ్ కీ విడుదలలో ఎపిపిఎస్సీ నిర్వాకం
విశాఖపట్నం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం ఎపిపిఎస్సీ నిర్వహించిన ఒక పరీక్షకు సంబంధించి విడుదల చేసిన కీ తీవ్రంగా విమర్శల పాలైంది. ఈ కీలో 180 ప్రశ్నలకు గాను ఏకంగా 81 తప్పు జవాబులను పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.
మొత్తం పేపర్ లో సుమారుగా సగం ప్రశ్నలకు అసలైన ఆన్సర్లు కాకుండా తప్పు సమాధానలనే సరైనవిగా పేర్కొనడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కీని ఆ సబ్జక్ట్ నిపుణుడి చేత విడుదల చేయించారా లేక దారినపోయే దానయ్యతో దిద్దించారా అని కొందరు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంతో పోస్టుల భర్తీకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహణలో ఎపిపిఎస్సీ డొల్లతనం ఈ పరీక్ష ద్వారా బట్టబయలైందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టులకు సహాయ ఆచార్యులు పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలలో ఎపీపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో సైకాలజీ సబ్జెక్టు కు సంబంధించి ఎపిపిఎస్సీ కొద్దిరోజుల కిందటే ఆన్సర్ కీ ని ఇంటర్నెట్ లో ఉంచింది. అయితే ఎపిపిఎస్సీ విడుదల చేసిన ఆన్సర్ కీ లో ఏకంగా 81 తప్పులు ఉండడంతో అభ్యర్థులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ ఎగ్జామ్ రాసినవారిలో పీహెచ్డీలు, ఫెలోషిప్లు పూర్తిచేసిన వారు కూడా ఉండటం గమనార్హం. దీంతో ఆయా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటనేది ప్రామాణిక గ్రంధాల్లోని ఆన్సర్లను ఊటంకిస్తూ ఆధారాలతో సహా ఆన్ లైన్ లో పెట్టారు.
ఇలా ప్రశ్నపత్రంలోని 180 ప్రశ్నలకు సమాధాన పత్రంలో ఏకంగా 81 తప్పిదాలుండడం ఎంత వరకు సమంజసమని వీరు ప్రశ్నిస్తున్నారు. సైకాలజీ మీద ఏ మాత్రం అవగాహన ఉన్నవారైనా సునాయాసంగా గుర్తించే కొన్ని ప్రశ్నలకు సైతం ఆన్సర్ కీలో తప్పు సమాధానాలు పేర్కొనడం ఎలా అర్థం చేసుకోవాలని ఎపీపీఎస్సీని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివే ఒక 45 వరకూ ఉంటాయని వివరిస్తున్నారు. ఎపీపీఎస్సీ సమాధానపత్రం రూపకల్పనకు సరైన నిపుణులను ఎన్నుకోలేదని దీన్ని బట్టి పులభంగా అర్తమైపోతుందని, నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి విషయాల్లో ఎపీపీఎస్సీ అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపీపీఎస్సీ విడుదల చేసిన ఈ తప్పులతడక కీ వల్ల సరైన సమాధానాలు పెట్టిన వారు మానసిక క్షోభకు గురయ్యారని, ఇదెక్కడి చోద్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సైకాలజీ పరీక్ష కీ విడుదలకు సంబంధించి అభ్యర్థుల నుంచి వెల్లువెత్తిన విమర్శలపై ఎపీపీఎస్సీ స్పందించింది. ఆన్సర్ కీలో తప్పుల విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ సమాధాన పత్రంతో పాటుగా ఇతర పరీక్షలకు సంబంధించి కీలలో కూడా తప్పిదాలను గుర్తించడానికి ప్రత్యేక కమిటీ వేశామని ఎపిపిఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఈ కమిటీ అభ్యర్థుల అభ్యంతరాలు అధ్యయనం చేసి సమాధాన పత్రాల్లో నిజంగానే తప్పులుంటే వాటిని గుర్తించి సరైన సమాధానంతో దాన్ని సరిదిద్దడం జరుగుతుందని చెప్పారు. ఎపీపీఎస్సీ ఇటీవల విడుదల చేసింది ప్రాథమిక కీ నే కాబట్టి అది తుది సమాధానపత్రం కాదు కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేకించి సైకాలజీ పేపర్ కీ పై ఎక్కువ విమర్శలు వచ్చినందున ఆ ఎగ్జామ్ ఆన్సర్ కీలో ఎన్ని తప్పిదాలు దొర్లాయన్న విషయాన్ని నిపుణులతో అధ్యయనం చేయించి ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే ఆన్సర్ కీ రూపొందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందంటున్నారు.